అమీర్పేట్, మే 23 : ఏడేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని.. సనత్నగర్ ప్రజలు మునుపెన్నడూ చూడని ప్రగతిని చూస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం సనత్నగర్ డివిజన్లో రూ. 1.52 కోట్ల తో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. సనత్నగర్లోని మతాతా టెంట్ హౌజ్, సామలకుంట బస్తీ, జెక్కాలనీలోని సీఎస్ఐ చర్చి ప్రాంతాల్లో తాగునీటి పైపులైను నిర్మాణ పనులు, సర్దార్ పటేల్ చౌక్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులు, వెల్ఫేర్ సెంట్ వద్ద సీవరేజీ పైపులైను నిర్మాణ పనులు, డీఎన్ఎం కాలనీలో మసీదు సమీపంలో వీడీసీసీ రోడ్డు నిర్మాణాలు, అశోక్కాలనీలో శిథిలావస్థకు చేరిన రోడ్ల పునరుద్ధరణ వంటి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఆయా కాలనీలను సందర్శించిన సందర్భాల్లో స్థానికులతో మాట్లాడుతూ సనత్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
సనత్నగర్ డివిజన్లో ఇప్పటి వరకు కోట్లాది నిధులు వెచ్చించినట్లు తెలిపారు. సనత్నగర్లో 5ఎంఎల్ తాగునీటి రిజర్వాయర్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అల్లావుద్దీన్ కోఠి బస్తీ వాసులకు వందలాది ఇళ్ల పట్టాలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, తాగునీటి పైపులైన్లు, సీవరేజీ వ్యవస్థ ఆధునీకరణ, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధి వంటి అనేక పనులను సనత్నగర్ డివిజన్లో చేపట్టినట్లు పేర్కొన్నారు. జెక్కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు సూర్యశంకర్రెడ్డితో పాటు కాలనీ సంఘాల అధ్యక్షులు షాబాద్ శ్రీనివాస్రావు, పుట్టల శేఖర్, సయ్యద్ సిరాజుద్దీన్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, ఖలీల్బేగ్, సంతోష్ సరఫ్, సురేశ్గౌడ్లతో పాటు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, జలమండలి జీఎం హరిశంకర్, టౌన్ప్లానింగ్ ఏసీపీ రమేశ్, ట్రాన్స్కో సనత్నగర్ ఏడీఈ అమర్నాథ్ పాల్గొన్నారు.