శంషాబాద్ రూరల్, మే 23 : శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సహకారంతో టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ. 20 కోట్లు, జనరల్ ఫండ్ నుంచి రూ. 2 కోట్లు నిధులు మంజూరు కావడంపై సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ పరిధిలో 25 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో చైర్ పర్సన్ సుష్మ, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు మేకల వెంకటేశ్, భారతమ్మ, చెన్నం అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా చైర్ పర్సన్, కమిషనర్ తీరును నిరసిస్తూ పలువురు కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు.