ఖైరతాబాద్, మే 22: తెలంగాణలోని అన్ని వర్గాలు, ప్రాంతాలు మరింత ఉన్నతిని సాధించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సావిత్రిబాయి ఫూలే మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర ఎస్సీ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రమేశ్తో కలిసి టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకన్న సుమారు 70 మంది మహిళలకు కుట్టు మిషన్లు, బ్యూటీషియన్ కిట్స్, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళల వికాసానికి, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రూ.50 కోట్లతో పది వేల మందికి వివిధ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించామని వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం ద్వారా కుటుంబానికి మరింత ఆసరాగా ఉంటారన్నారు. బస్తీ స్థాయి నుంచి మహిళలను ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి పరికరాలు అందిస్తూ వారి ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నామన్నారు. సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు బెల్లం మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు ఆరెపల్లి రాజేందర్, ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.