సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): మహిళలను, యువతులను వేధించే వారిపై హైదరాబాద్ షీ టీమ్స్ ఉక్కుపాదం మోపుతున్నాయి. తప్పు చేసిన వారికి జైలు శిక్షలు పడేలా చేస్తున్నాయి. నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా ఈవ్ టీజర్స్ను పట్టుకుంటున్నారు. వయస్సు మళ్లిన వారు సైతం మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలను వేధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు ఇచ్చే ఫిర్యాదుల్లో సున్నితమైన అంశాలు ఉన్నప్పుడు షీ టీమ్స్ అధికారులు జాగ్రత్తలు తీసుకొని..బాధితులకు న్యాయం చేస్తున్నారు.
తప్పు చేస్తే..
నిశబ్దం వీడండి.. వేధింపులు ఎదురైతే వెంటనే తమకు ఫిర్యాదు చేయండి.. అంటూ షీ టీమ్స్ బృందాలు మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. విద్యా, వ్యాపార, రద్దీ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలను తీవ్రంగా వేధించే వారిని ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తున్నారు. 65 ఏండ్ల వృద్ధుడు తన పక్కింటి మహిళను వేధించాడు. షీ టీమ్స్ పోలీసులు అతడిపై సిటీ పోలీస్ యాక్టు కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి 8 రోజుల జైలు శిక్ష విధించింది. చిన్న చిన్న విషయాలపై కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మరోసారి నేరం చేసినట్టు ఫిర్యాదు వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తూ విడిచిపెడుతున్నారు. మహిళలను వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని షీ టీమ్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. షీ టీమ్స్ నిఘా పెరగడంతో పాటు ఈవ్ టీజర్లను పట్టుకోవడంతో నగరంలో మహిళలను వేధిస్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. షీ టీమ్స్ పనితీరును మహిళలు ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సెల్ఫోన్ వేధింపులు..
సోషల్ మీడియా, సిమ్కార్డులతో మహిళలను వేధించే వారు ఎక్కువవుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టి ఈవ్ టీజర్ల భరతం పడుతున్నారు. అయితే, కొందరు ఈవ్టీజర్లు సెల్ఫోన్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇలా వేధింపులకు గురిచేస్తున్న వారిలో 95 శాతం బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు. ఈ తరహా కేసుల్లో బాధితులకు ఇబ్బందులు రాకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.