మారేడ్పల్లి, మే 22: వైద్యులు దేవుళ్లతో సమానమని, ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి కరోనా సమయంలోనూ వారు వైద్య సేవలందించారని, వారి సేవలు అభినందనీయమని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తనకు వైద్య వృత్తిలోకి రావాలనే కోరిక బాగా ఉండేదని, కాని ఇప్పుడు కాబోయే యువ వైద్యులను చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుందని ఆమె అన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో 10వ తరగతికి వెళుతున్న విద్యార్థులకు వైద్య వృత్తిపై అవగాహన కల్పించేందుకు మంత్రి విచ్చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించిన 10వ ‘వార్షిక యంగ్ డాక్టర్స్ క్యాంప్’ ఆదివారం ముగింపు కార్యక్రమం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నిర్వహించారు. ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబిత జ్వోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ, వైద్యులు దేవుళ్లతో సమానం అని, కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని తెలిపారు.
యశోద ఆసుపత్రి యాజమాన్యం కూడా డాక్టర్స్ కావాలనుకునే వారికి మరింత ప్రోత్సాహం, అవగాహన కల్పించేందుకు పదేళ్లుగా ‘యంగ్ డాక్టర్స్’ కార్యక్రమం నిర్వహిస్తూ.. ఎంతో మంది వైద్యులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారని వారిని అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నారని, దీంతో భారీగా మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చి మరింత మంది డాక్టర్లు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. గురుకులాలు, కస్తూర్భా, మోడల్స్ స్కూల్స్తో పాటు పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం తరుపున కూడా వెబ్సైట్ ద్వారా ఏఏ కోర్సులు చేస్తే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయనేది తాము ప్రచారం కల్పిస్తున్నామని వెల్లడించారు. నాడు సమాజంలో బాలికలు చదువుకోవాలంటే సమాజం, కుటుంబం నుంచి ఎన్నో అడ్డంకులు ఉండేవని, కాని, నేడు తల్లిదండ్రులతో పాటు సమాజలోని వివిధ వర్గాల నుంచి ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
అనంతరం, యశోద ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి ధీరజ్ మాట్లాడుతూ, ఈ పదేళ్లలో యశోద ఆసుపత్రి యంగ్ డాక్టర్స్ క్యాంప్లో పాల్గొన్న 200 మందికి పైగా విద్యార్థులు దేశ, విదేశాల్లో వైద్య వృత్తి శిక్షణలోనూ, డాక్టర్లు గాను సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సారి 3000 మంది యంగ్ డాక్టర్స్ క్యాంప్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా వార్షిక పరీక్షల్లో వారు సాధించిన మార్కులతో పాటు వైద్య రంగం పట్ల వారి ఆసక్తిని పరీక్షించడం ద్వారా ఈ ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ గోరుకంటి, సికింద్రాబాద్ యూనిట్ ఇన్చార్జి డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ లింగయ్య పాల్గొన్నారు.