ఘట్కేసర్, మే 22 : ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లోని మూడెకరాల స్థలంలో 5.50 కోట్లతో జిల్లా స్థాయి బాలికల ఐటీఐ కళాశాల భవన నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ విద్య, సంక్షేమ, మౌలిక వసతుల, అభివృద్ధి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) హెచ్ఏఎల్ కంపెనీ ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మిస్తున్నది.
ప్రస్తుతం వస్తున్న నూతన విద్యావిధానాలకు అనుగుణంగా భవనాన్ని డిజైన్ చేసి నిర్మాణం చేపడుతున్నారు. 2021 డిసెంబర్ 22న జీ ప్లస్ వన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా… జనవరి నెలలో పూర్తి స్థాయి పనులు ప్రారంభమయ్యాయి. 11వేల,764 ఫీట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ప్లోర్లో ప్రిన్సిపాల్ , స్టాప్ గదులతో పాటు, వర్క్షాప్, టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తారు. భవనం పై అంతస్తులో సుమారు వందమంది విద్యార్థినులు ఉండే విధంగా 943 ఫీట్ల విస్తీర్ణంలో హాస్టల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను రాష్ట్ర విద్యాశాఖ తరఫున పర్యవేక్షిస్తున్న ఏ.ఈ జవహర్ వివరించారు. 2023 మార్చి నాటికి భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
అభివృద్ధి దిశగా ఘట్కేసర్..
ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నది. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో ఘట్కేసర్ మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి జరిగింది. మున్సిపాలిటీలో జిల్లా స్థాయి బాలికల ఐటీఐ కళాశాల ఏర్పాటు కావడం హర్షణీయం.
-ఎం.పావనీ జంగయ్య యాదవ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్