సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ);నగరాన్ని శబ్దకాలుష్యం నుంచి విముక్తి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. అధిక శబ్దాలు, ఒళ్లు జలదరించే హారన్లు వినియోగించే వారిపై కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989 కింద రూ.1000 జరిమానాతోపాటు కేసు నమోదు చేయనున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈనెల 10 నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీ శబ్దాలు వచ్చే 3320 హారన్లను తొలగించారు. వాహన కంపెనీ తయారు చేసిన హారన్ కాకుండా ఇతర హారన్లు ఉపయోగిస్తే వారిపై కేసు నమోదుతో పాటు చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపర్చనున్నారు. హారన్తోపాటు సైరన్ ఉపయోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.
హారన్లతో ఆరోగ్య సమస్యలు
మోతాదుకు మించి హారన్ల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వినికిడి లోపం, గుండె సంబంధిత సమస్యల బారిన పడుతారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో
ఉన్నవారికి అసౌకర్యంగా ఉంటుంది. ప్రధానంగా చిన్నారుల్లో చెవుడు సమస్య మొదలవుతుంది.