మారేడుపల్లి, మే 21: మహిళా ప్రయాణికులే లక్ష్యంగా బంగారు నగలు, విలువైన వస్తువులు దొంగిలిస్తున్న పాత నేరస్థురాలిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి రూ.25 లక్షలు విలువ చేసే 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు కార్యాలయంలో ఎస్పీ అనూరాధ కేసు వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి ఆల్విన్కాలనీ తులసీనగర్ ప్రాంతానికి చెందిన ఆరూరి ప్రియ (40) గృహిణి. గతంలో పేట్బషీరాబాద్, కూకట్పల్లి, కేపీహెచ్బీ పోలీసుస్టేషన్ల పరిధిలో పలు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లొచ్చింది. కాగా, ఈనెల 17న నిజాంపేట ప్రాంతానికి చెందిన వెంకాయమ్మ కుటుంబసభ్యులతో కలిసి మణుగూరుకు వెళ్లడానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు గేట్ నం.4 నుంచి లిఫ్ట్లో ప్లాట్ఫారానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రియ చాకచక్యంగా లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వెంకాయమ్మ బ్యాగ్లోని ఆభరణాలను తస్కరించింది. ఆందోళన చెందిన వెంకాయమ్మ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ రైల్వే అర్బన్ డీఎస్పీ నర్సయ్య, ఇన్స్పెక్టర్ శ్రీను, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ నర్సింహ, ఎస్ఐ మజీద్, సిబ్బంది పాల్గొన్నారు.