మియాపూర్, మే 21 : ప్రభుత్వ పాఠశాలల్లో తగు వసతుల కల్పనతో ప్రయివేటుకు దీటుగా నిర్వహించేందుకు గాను మండలంలో తొలి దశలో 24 పాఠశాలలకు రూ.4.82 కోట్ల నిధుల మంజూరు అయినట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. వీటిని ఎంపికైన పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులను కల్పించేందుకు ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంపై మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో విప్ గాంధీ శనివారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లు, టాయిలెట్లు, తాగునీటి వసతి, ప్రహరీ నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆహ్లాదకరమైన పెయింటింగ్ పనులను చేపట్టాలని, పాఠశాలల రూపురేఖలను మార్చాలన్నారు.
పాఠశాలలకు తగు బడ్టెట్ కేటాయింపుపై తన అభ్యర్థనను ప్రభుత్వం తక్షణమే అంగీకరించి నిధులు విడుదల చేయటం సంతోషకరమని, ఈ సందర్భంగా పాఠశాలలు, విద్యార్థుల తరపున ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నిర్ధారిత పనులను సకాలంలో పూర్తి చేసి పాఠశాలల పునః ప్రారంభం నాటికి అన్ని వసతులను కల్పించాలని విప్ గాంధీ అధికారులకు సూచించారు. నిధుల వినియోగంలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు విక్రమ్, శ్యామ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
అభివృద్ధికి కృషి..
హఫీజ్పేట్ డివిజన్ మైత్రీనగర్ ఫేజ్ 2 లోని పార్కు అభివృద్ధి పనులకు సీడీపీ నిధుల నుంచి రూ.10 లక్షల కేటాయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు పంపిన ప్రతిపాదన లేఖను కాలనీ ప్రతినిధులకు విప్ గాంధీ శనివారం తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. కాలనీల అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానన్నారు. కాలనీలలోని పార్కులను సుందరవనాలుగా తీర్చిదిద్ది కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రాచోటి తదితరులు పాల్గొన్నారు.
సహాయనిధి అందజేత..
గచ్చిబౌలి డివిజన్ నలగండ్లకు చెందిన వెంకటయ్యకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా.. రూ.2 లక్షల ఆర్థిక సాయంకు సంబంధించిన మంజూరు పత్రాలను విప్ అరెకపూడి గాంధీ శనివారం తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆపదలో ఉన్న వారిని ఈ పథకం ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్, భద్రయ్య, సురేందర్ పాల్గొన్నారు.
పనులకు శంకుస్థాపన..
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో రూ.18 లక్షలతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి విప్ గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైనేజీలు, తాగునీరు, సౌకర్యవంతమైన రహదారులు, మెరుగైన విద్యుత్, కమ్యూనిటీహాళ్లు వంటి మౌలిక వసతులను ప్రతి కాలనీలో కల్పించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు గాంధీ తెలిపారు. కాలనీలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందిస్తానని, అభివృద్ధి పనులలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వప్న, గురువారెడ్డి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, భాస్కర్రావు, రామచంద్రరావు, హిమగిరిరావు, విజయ్, బాబు, కార్తిక్, అల్లం మహేశ్, రాజయ్య, శంకర్రావు పాల్గొన్నారు.