సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): పది పరీక్షలు.. విద్యార్థి జీవితానికి పునాది. భవిష్యత్ విద్యాభ్యాసానికి కీలక మలుపు. ఇందులో వచ్చే మార్కులు, గ్రేడు ఆ విద్యార్థి కేరీర్కు మైలురాయిగా నిలుస్తుంది. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పడిన విద్యార్థులు మరో రెండు రోజుల్లో (ఈ నెల 23 నుంచి) షురూ కానున్న పరీక్షలు రాసి భవిష్యత్తును పదిలం చేసుకోనున్నారు. అయితే మొదటిసారి బోర్డ్ పరీక్షలు రాస్తుండటంతో విద్యార్థులు కొంచం ఒత్తిడికి గురవుతుంటారు. సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు రాస్తున్న సమయంలో ఆహారం నుంచి వ్యాయామం వరకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
ఒత్తిడిని అధిగమిద్దాం..!
పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావిడిగా మాట్లాడటం వలన డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడితో బాధపడేవాళ్లు మతిమరుపునకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సరిపడా నిద్ర, మంచి ఆహారం, చుట్టూ మంచి వాతావరణం ఉండేలా చూసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అనవసర విషయాలను పట్టించుకోకుండా లక్ష్యం వైపునకు అడుగులు వేయాలని చెబుతున్నారు.
పోషకాహారం తీసుకోవాలి
విద్యార్థులు పోషకాహారం తీసుకోవాలి. సమతుల ఆహారం పిల్లల ఆరోగ్యం, చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరీక్షలు బాగా రాయగలుగుతాం.
– సనా ఫాతిమా,హెడ్ న్యూట్రీషనిస్ట్
ఫలితంపై ఆలోచనలు వద్దు
ఫలితాల గురించి భయపడటం మానేసి ప్రణాళికతో చదువాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. పరీక్షలు రాసే సమయంలో పాజిటివ్ దృక్పథం అలవరుచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
-నందితా ఆస్తాన శంకర్,కౌన్సెలింగ్ సైకాలజిస్టు