సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : రచనా పటిమకు వయసుతో సంబంధం ఉండదు. కాలంతో ఎంత ఎక్కువగా సహగమనం చేస్తే అంతగా కలంలో పదును తేలుతుంది. అటువంటి సాహితీమూర్తులు కొందరు తెలుగు రచనా స్థాయిని పెంచేందుకు ఇతోధిక కృషి చేస్తున్నారు. నేటికీ అక్షర సేద్యం చేస్తూ వయసు శరీరానికే కానీ.. ఆలోచనకు కాదని చాటిచెబుతున్నారు. ఇటీవల తెలుగు యూనివర్సిటీలో ‘షష్టికలాలకు మాతృవందన’ కార్యక్రమంలో సన్మానం పొందిన కొంతమంది సాహితీమూర్తులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. నేటి టెక్నాలజీ యుగంలో యువ కలాలకు ఉన్న అవకాశాలను చెబుతూనే ఆనాటి తమ రచనలకు కారణమైన పరిస్థితులను పంచుకున్నారు.
సామాజిక సమస్యలే నా రచనలు
నాకు 72 ఏండ్లు. చదువుకున్న రోజుల్లోనే కథలు రాశా. కాలేజీ మ్యాగజైన్లో నా కథలు అనేకం ప్రచురితమయ్యాయి. పది కథల సంపుటాల, 16 నవలలు రాశా. నా రచనలన్నీ సామాజిక కోణంలోనే ఉంటాయి. నేను రాసిన ఖలిస్థాన్ కథకు మంచి గుర్తింపు వచ్చింది. శ్రీశ్రీ ప్రేరణతో వందకు పైగా కవిత్వాలు రాశా. ఇప్పటికీ ఏదో ఒకటి రాస్తూనే ఉంటా. మన చుట్టూ జరుగుతున్న ఘటనలను నిశితంగా పరిశీలిస్తే మనకు ఓ ఆలోచన వస్తుంది. వాటికి అక్షరరూపం కల్పించకలగాలి. ఏ భాషలోనైతే రాయాలనుకుంటున్నామో ఆ భాషపై మంచి పట్టు సాధించాలి. నేటి తరానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
– గంటి భానుమతి, రచయిత
రచనలు చేయడం నేర్పమని అడుగుతున్నారు..
నాకు 73 ఏండ్లు. నేను మొట్టమొదటగా తెలుగులో ‘అస్థిత్వ రంగ’ అనే దీర్ఘ కావ్యం రా శా. నా రచనలను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా. సోషల్ మీడియా విస్తృతమయ్యాక కవితలు, రచనలు మంచి స్పందన లభిస్తున్నది. అభిమానులు పెరుగుతున్నారు. చాలా మంది రచనలు చేయడం నేర్పమని అడుగుతున్నారు. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉంటే అలవోకగా రచనలు చేయవచ్చు. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అన్నదానిపై రచయితకు క్లారిటీ ఉండాలి. అప్పుడే ఆ రచనకు మంచి పేరు వస్తుంది.
– శీలా సుభద్రాదేవి
ఏడు పుస్తకాలు రాశా..
నాకు 91 ఏండ్లు. పుస్తక పఠనం అంటే ప్రాణం. చిన్నప్పుటి నుంచి పేపర్లో వచ్చే ప్రతి అక్షరాన్ని వదలకుండా చదివేదాన్ని. స్నేహితులు, ఇంట్లో వాళ్లు పుస్తకాల పురుగు అని పిలిచేవాళ్లు. నేను 14 ఏండ్ల వయసు నుంచే రచనలు చేస్తున్నా. ఏ ఆలోచన వచ్చినా పేపర్పై పెట్టేదాన్ని. ఏడు పుస్తకాలు రాశా. మాతరంలో ఒకరు చేసిన రచనలు మరొకరికి తెలిసేవి కావు. కానీ ఇప్పుడు ఆలా కాదు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకంలో లేని సమాచారం కూడా ఇంటర్నెట్లో దొరుకుతుంది.
– వాసిరెడ్డి కాశీరత్నం, రచయిత
అన్ని ఆధునిక ప్రక్రియల్లో రచనలు చేశా..
గీతామృతం పేరుతో భగవద్గీతలోని 108 శ్లోకాలను ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా రాశా. అన్ని ఆధునిక ప్రక్రియలో రచనలు చేశా. నేను రాసిన మార్నింగ్ కాఫీ కథకు విశేష ఆదరణ లభించింది. 40కి పైగా రచనలు, మూడు ఆధ్యాత్మిక పుస్తకాలు రాశా. సోషల్ మీడియాలను అర్థం చేసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది. కానీ ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం. క్షణాల్లో మన రచనలు, ఆలోచనలను పంచుకోవచ్చు. వేలాది స్పందనలు వస్తుంటాయి. నెటిజన్ల సూచనలతో కూడా మన రచనలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది.
– డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ