సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ చలాన్ విధించిన నెల రోజుల్లోపు క్లియర్ చేసుకుంటే వాహనదారులకు 20శాతం వరకు రాయితీ ఇచ్చే యోచనలో నగర ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ప్రతిపాదనల దశలో ఉన్న ఈ స్కీమ్ను కార్యచరణలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఈ విధానంతో వాహనాదారులలో ట్రాఫిక్ నిబంధనలపై మరింత అవగాహన తేవడం, మరోసారి చలాన్ పడకుండా వాహనదారుడిని జాగ్రత్తపడడం చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒకసారి వాహనదారుడు చలాన్ పడిన వెంటనే జరిమాన చెల్లిస్తే, మరోసారి ట్రాఫిక్ ఉల్లంఘన చేయవద్దనే భావన కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఒకటే కదా.. చూద్దామని వేచి చూసే వాళ్లు పదుల సంఖ్యలో జరిమానాలు విధించినా పట్టించుకోరు. రేపు చెల్లిద్దాం అనుకుంటూ వాయిదా వేస్తూనే ఉంటారు. చలాన్లు పెరుగుతున్నా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ఆలోచన చేయరు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ఈ కొత్త స్కీమ్ ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.