ఎర్రగడ్డ, మే 18 : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు మతి భ్రమించిందని.. ఆయన వీలైనంత త్వరగా ఎర్రగడ్డ మెంటల్ దవాఖానాలో చేరితే బాగుంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ హితవు పలికారు. ఇటీవల జరిగిన బీజేపీ సభలో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని బండి సంజయ్ పదే పదే అనటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బుధవారం ప్రజా సమస్యలపై పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే నంబర్ 1 సీఎంగా కేసీఆర్ పేరు సంపాదించుకున్నారని.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చి వాగుడుకు దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని.. మన వద్ద ఇప్పుడు ఎన్నికల్లేవు.. మరి ఒక్క ఛాన్స్ అంటే ఏమిటబ్బా అని ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే దళిత బంధు, రైతు బంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలను కర్నాటక, యూపీ, గుజరాత్ తదితర రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని గోపీనాథ్ ఛాలెంజ్ విసిరారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్రెడ్డి పిట్టల దొరలా తయారయ్యాడన్నారు. మైకుల ముందు కొట్టే గప్పాలను ప్రజలు ఎట్టి పరిస్థితిలో నమ్మరన్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టిందేమిటో అందరికీ తెలిసిందేనని మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు.