నిధులున్నాయి..టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. నెలలు గడుస్తున్నాయి అయినా అధికారుల్లో అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది.సీసీ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.27 లక్షల నిధులను మంజూరు చేసింది. అధికారులు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి రోజులు గడుస్తున్నా పనులు ప్రారంభించడం లేదు. పనులను వెంటనే ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.
-అడ్డగుట్ట, మే 18
శాశ్వత పరిష్కార దిశగా..
అడ్డగుట్ట చౌరస్తా నుంచి మజీద్ వరకు రోడ్డు గుంతలమయంగా మారడమే కాకుండా మ్యాన్హోళ్లు తరుచు భూమిలోకి కుంగడంతో స్థానికులు, ఆ దారిగుండా రాకపోకలను సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తుందని పలువురు వాపోతున్నారు. మ్యాన్హోళ్లు భూమిలోకి కుంగడంతో మురుగునీరు నిల్వ అయి దుర్గాంధం వెదజల్లడడంతో సమస్య మరింత తీవ్రతరమవుతుందని వారు చెప్పుకొస్తున్నారు. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నా సంబంధిత అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి వదిలేశారే తప్పా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు. అడ్డగుట్ట చౌరస్తా మీదుగానే తుకారాంగేట్ పోలీస్స్టేషన్కు, అడ్డగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయానికి నిత్యం వందలాది మంది రాకపోకలను సాగిస్తుంటారు. కావున ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు ఇప్పటికైనా సీసీ రోడ్డు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.
అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం
సీసీ రోడ్డు పనులను ప్రారంభించడంలో కొంతవరకు ఆలస్యం జరిగింది. అతి త్వరలో పనులను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. టెండర్ పక్రియ కూడా పూర్తయింది. సాధ్యమైనంత త్వరగా పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.
– వేణు, జీహెచ్ఎంసీ ఏఈ