సికింద్రాబాద్, మే 18: కంటోన్మెంట్ పరిధిలోని రెండో వార్డు నారాయణ జోపిడి సంఘం బస్తీలో నూతనంగా నిర్మించనున్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన అర్హులందరికీ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. కొంత కాలం క్రితం నారాయణ జోపిడి సంఘం బస్తీలో నివాసముంటున్న వాళ్లు ఇండ్లు ఖాళీ చేశారు. ఈ ప్రాంతంలో డబుల్ ఇండ్లు నిర్మిస్తున్న తరుణంలో ఖాళీ చేసిన వారికి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు. అయితే అందులో పలువురుకి పొజిషన్ సర్టిఫికెట్లు అందలేదన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అర్హులైన పలువురికి సర్టిఫికెట్లు జారీ కాలేదని కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏడుగురు లబ్ధిదారులకు జారీ అయిన పొజిషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ప్రతి అర్హుడికి ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, గఫ్ఫార్, యూసఫ్, లక్ష్మి, గ్రీష్మా, గౌస్, బాషా, రహీమ్, జహంగీర్, బాలు, రేష్మ, సాయికృష్ణ పాల్గొన్నారు.