బంజారాహిల్స్/హిమాయత్నగర్,మే 18: కాలనీల్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టే లక్ష్యంతో జూన్ 3నుంచి నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం 13 బృందాలను ఏర్పాటు చేశామని డీఎంసీ రజినీకాంత్రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణపై జీహెచ్ఎంసీ, జలమండలి, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో పాటు స్థానిక బస్తీల నాయకులతో బుధవారం బంజారాహిల్స్లో సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ఈనెల 20నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినా ఎండలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో జూన్ 3నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంసీ తెలిపారు.
సర్కిల్ 18లో 149 కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, దీనికోసం 13 బృందాలను నియమించామన్నారు. ఒక్కో బృందంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉంటారన్నారు. ఒక్కో బృందాన్ని సమన్వయ పరిచేందుకు నోడల్ అధికారులను నియమించామన్నారు. డెబ్రీస్ తొలగింపు, చెట్ల కొమ్మల తొలగింపు, వీధిదీపాల మరమ్మతులు, ఎంటమాలజీ విభాగం ద్వారా యాంటీ లార్వా ఆపరేషన్స్ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. జలమండలి అధికారులు కూడా పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని ప్రాంతాలలో పర్యటిస్తారని, లీకేజీలు, కలుషిత నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని జలమండలి డీజీఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజల్ని భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని అంబర్పేట సర్కిల్-16 డీసీ వేణుగోపాల్ అన్నారు. రెండో విడుత పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా హిమాయత్నగర్ డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈసందర్భంగా డీసీ వేణుగోపాల్ మాట్లాడుతూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి పట్టణ రూపు రేఖలు మార్చి ప్రజల్లో మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్,ఈఈ శంకర్ పాల్గొన్నారు.