కేపీహెచ్బీ కాలనీ, మే 18 : పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా.. పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో పట్టణ ప్రగతిపై అధికారులు, కార్పొరేటర్లతో జడ్సీ మమత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం పట్టణ ప్రగతిని నిర్వహించడం జరుగుతుందన్నారు. పదిహేను రోజులపాటు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలందరూ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. కాలనీలు, బస్తీలలో ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటోను వెళ్లేలా చేయడం..
తడిపొడి చెత్తను వేరు చేయడం, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను, చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లపై గుంతలు లేకుండా చూడడం, పార్కులలో చెత్తను తొలగించడం, వర్షంనీటి కాలువలలో వ్యర్థాలను తొలగించే పనులు చేయాల్సి ఉంటుందన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. సంపూర్ణంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కొనసాగుతుందన్నారు. నోడల్ ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్తులను చేస్తూ పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ రవికుమార్, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహాబేగం, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్, రోజాదేవి, మహేందర్, అధికారులు పాల్గొన్నారు.
పరిశుభ్రంగా ఉండాలి ..
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య కార్మికులు బాధ్యతగా పనిచేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్ ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించిన జడ్సీ మమత.. రోడ్డు పక్కన చెట్ల కొమ్మలు, చెత్తాచెదారం ఉండడాన్ని గమనించి పారిశుధ్య కార్మికుల పనితీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలో చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని పారిశుధ్య విభాగం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి తదితరులున్నారు.