అబిడ్స్, మే 18 : నేషనల్ కమ్యూనికేబుల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటా సర్వే కొనసాగుతోంది. యూపీహెచ్సీ సిబ్బంది బస్తీల్లోని నివాసాలకు వెళ్లి నివాసముంటున్న వారి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేసుకుంటున్నారు. యూపీహెచ్సీ ఏఎన్ఎంలు, ఎన్సీడీ స్టాఫ్ నర్సులు, ఆశవర్కర్లు ఇంటింటికి తిరిగి ఈ సర్వేను చేపడుతున్నారు. ప్రతి నివాసంలో బీపీ, షుగర్, క్యాన్సర్, ఇతరత్రా వ్యాధులు ఉన్న వారి వివరాలను నమోదు చేసేందుకు గాను ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి నిత్యం సిబ్బంది బస్తీల్లో తిరిగి సర్వేను చేపడుతున్నారు. గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని యూపీహెచ్సీల పరిధిలో ఈ సర్వేను కొనసాగిస్తున్నారు. ఎన్సీడీ స్టాఫ్ 50 మంది, ఏఎన్ఎంలు 60 మంది, ఆశ వర్కర్లు 60 మంది వివరాలను నమోదు చేయాలని టార్గెట్ విధించి సర్వేను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్ సర్వే ద్వారా సేకరించిన వివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నారు. ప్రతి నిత్యం యూపీహెచ్సీ పరిధిలోని సిబ్బందికి ప్రాంతాల వారీగా సర్వే బాధ్యతలను అప్పగించారు. ఈ నెలాఖరు వరకు ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
అఫ్జల్సాగర్లో సర్వే ..
అఫ్జల్సాగర్లో నిర్వహించిన సర్వేను నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు పూజారిలాల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు, నర్సులు, ఆశవర్కర్లకు సహకారాన్ని అందించారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సర్వే వలన ప్రజలకు ఉపయోగ పడుతుందన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి ఉన్న వారికి మందులు అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ సర్వేలో ఆశ వర్కర్ యశోవ, పతిభ, నర్సు ముస్కాన్ పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ప్రత్యేక శ్రద్ధ ..
ఇంటింటా నిర్వహిస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు గాను అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏఎన్ఎంలు, నర్సులు, ఆశవర్కర్లు చేపడుతున్న ఈ సర్వేపై మెడికల్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వారు సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలన చేస్తున్నారు. ప్రతి నిత్యం ఆశవర్కర్లు చేస్తున్న సర్వేను ఉన్నతాధికారులు పర్యవేక్షించడంతో పాటు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఇప్పటికే 63 శాతం వరకు పూర్తి కావస్తున్న సర్వేను మే నెలాఖరు కల్లా పూర్తి చేయనున్నారు.