చర్లపల్లి, మే 18 : అదృశ్యమైన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కుషాయిగూడ డిపో సమీపంలోని గ్రీన్ హిల్స్ కాలనీలో గత కొంత కాలంగా తిరుమల్రావు భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. కాగా.. తిరుమల్రావు కుమారుడు వెంకటకల్యాణ్(7) బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేందుకు దారి దొరకక కుషాయిగూడ డిపో ప్రధాన రహదారిపై తిరుగుతుండటంతో స్థానికులు, ప్రయాణికులు గమనించి వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించి బాలుడిని పోలీసులకు అప్పగించారు. వెంటనే పోలీసులు సంబంధించిన వాట్సప్ గ్రూప్, స్థానిక గ్రూప్లలో ఫొటోలు షేర్ చేసి విచారిస్తుండగా.. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అంది పోలీస్స్టేషన్కు వచ్చారు. వెంటనే తల్లిదండ్రులను విచారించి సదరు బాలుడిని అప్పగించారు. సకాలంలో పోలీసులు స్పందించి వెంకట కల్యాణ్ను అప్పగించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.