‘మానవ సేవే మాధవ సేవ’ అన్న నానుడిని నూటికి నూరుపాళ్లు నమ్ముతారు ఆయన. తాను చదువుకున్న విద్యను పదిమందికీ పంచుతూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారు. రుద్రాక్షల వల్ల కలిగే లాభాలను భక్తులకు తెలియజేస్తున్నారు. అంతటితో ఆగలేదు. తాను చిన్నతనంలో పడిన కష్టాలు ఇంకెవరికీ రాకూడదని నిర్ణయించుకున్నారు. సంపాదనలో కొంత అన్నార్తుల కోసం కేటాయిస్తున్నారు. నిత్యం 500 మందికి అన్నదానం చేస్తూ తనలోని సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. ఆయనే రుద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రుద్రాక్ష రత్న పాండురంగారావు.
– ఖైరతాబాద్, మే 17
ఆకలి బాధ నుంచే ఆలోచన..
ఆకలి బాధ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించిన పాండురంగారావు.. అన్నార్తులకు కడుపునిండా భోజనం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో అన్నదాన కేంద్రం స్థాపించారు. నిత్యం 500 మందికి అన్నం, సాంబారు, ఒక కూర, రోటి పచ్చడి, పెరుగు, అప్పడాలతో నాణ్యమైన భోజనం అందజేస్తున్నారు. పాండురంగారావు ఇంట్లో ఎలాంటి ఆహారం తీసుకుంటారో అలాంటి ఆహారమే అన్నార్తులకు కూడా సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సన్నబియ్యం, రిఫైన్డ్ అయిల్, డబుల్ పాలిష్డ్ కందిపప్పు వినియోగిస్తున్నారు. మొత్తం 15 మంది వంట మనుషులు, ఇతర సహాయకులు పనిచేస్తున్నారు. నిత్యం పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసి వడ్డిస్తారు. తాగునీటి కోసం 600 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అన్నం తిని అక్కడే స్వచ్ఛమైన నీటిని తాగే ఏర్పాట్లు చేపట్టారు.
రుద్రాక్ష.. ఓ అధ్యాత్మిక ఆస్తి
ఈశ్వరుడి ప్రతిరూపంగా రుద్రాక్షను కొలుస్తారు. దాని ధారణ ద్వారా ఆధ్యాత్మికత పెంపొందడమే కాదు…. ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఇది శాస్ర్తోక్తంగా వెల్లడైంది. 20 ఏండ్లుగా దీనిపై దేశవిదేశాల్లో పాండురంగారావు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రులతో పాటు ఎంతోమంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, సినీ నటులు, సెలబ్రిటీలకు రుద్రాక్ష ద్వారా ఆధ్యాత్మిక పరిమళాలను పంచారు. రుద్ర డివైన్ పవర్ పేరిట పుస్తకాన్ని రచించారు. అది దేశంలోని 15 భాషల్లో అందుబాటులో ఉంది. దేశంలోని పలు రాష్ర్టాలతో పాటు యూఎస్ఏ, యూకే, కెనడా, సింగపూర్, దుబాయిలోని శాఖల ద్వారా రుద్ర ఫౌండేషన్ తన సేవలను విశ్వవ్యాప్తం చేసింది.
సేవే పరమావధి..
అన్నానికి పేద, మధ్యతరగతి, వర్గం, వర్ణం భేదం ఉండదు. అలాంటి అన్నదానం చేయడానికి ఎలాంటి వెనకడుగూ వేయడం లేదు రుద్ర ఫౌండేషన్. నిత్యం భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, కడు పేదరికంలో ఉన్న వారి కడుపు నింపుతున్నారు. చాలా మంది పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. అంతేకాదు.. పాత బట్టలను సేకరించి పేదలకు అందిస్తున్నది ఈ ఫౌండేషన్. కరోనా సమయంలోనూ రుద్ర ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి నిత్యావసర సరుకులు అందజేసి బాసటగా నిలించారు.
ఆకలి, వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి
పశ్చిమ బెంగాల్లో పుట్టిన నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను. బనారస్ హిందూ యూనివర్సిటీలో వేదిక్ మ్యాథ్స్ పూర్తి చేశాను. అమెరికాలో డాక్టరేట్ అందుకున్నాను. 30 ఏండ్లుగా రుద్రాక్ష ద్వారా ఆధ్మాతిక ఆరోగ్యాన్ని అందిస్తున్నాను. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే వారే ప్రపంచంలో అతిపెద్ద అదృష్టవంతులన్నది నా అభిప్రాయం. కొందరు వీఐపీలు కూడా ప్రస్తుతం వృద్ధాశ్రమాల్లో బతుకీడుస్తున్నారు. అలాంటి వారిని చూసి బాధ కలుగుతున్నది. ఆకలి, వృద్ధాశ్రమాలు లేని సమాజ నిర్మాణం చూడాలన్నదే నా జీవితాశయం.
– రుద్రాక్షరత్న పాండురంగారావు, రుద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు