సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పట్టణ ప్రగతి దోహదం చేస్తుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మే 20 నుంచి జూన్ 5 వరకు కొనసాగే పట్టణ ప్రగతిపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్, డీసీ, హెల్త్ అండ్ శానిటేషన్, ఇతర విభాగాల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ‘పట్టణ ప్రగతి’ నిరంతర ప్రక్రియ అన్నారు. శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.బోయగూడ అగ్నిప్రమాదం, ఎల్బీనగర్లో సిమ్మింగ్పూల్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. నగరవాసుల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదన్నారు. నాలాల పూడికతీత పనులు చేపడుతున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పూడికతీత పనుల్లో కార్పొరేటర్లు భాగస్వామ్యులయ్యేలా చూడాలని కోరారు. క్లీనింగ్ యంత్రాల పనితీరుపై ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలని.. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి నోటీసులతో సరిపెట్టకుండా కూల్చివేతలు చేపట్టాలన్నారు.
ఇలా చేయాలి..
వార్డుల వారీగా సేకరించిన నిర్మాణ వ్యర్థాలు, గ్రీన్వేస్ట్ను తాత్కాలికంగా గుర్తించిన పాయింట్లకు తరలించాలని కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. అవెన్యూ, మీడియన్లలో ఏర్పాటు చేసిన మొక్కల పక్కన ఉన్న చెత్తను తొలగించడంతో పాటు ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ స్థలాల్లోని చెత్తను యజమానులు తొలగించని పక్షంలో అధికారులే తొలగించి చార్జీలతో పాటు జరిమానా విధించాలన్నారు.దోమల నివారణతో పాటు సీజనల్ వ్యాధులపై ఇంటింటికి వెళ్లి ముందస్తు చర్యలపై అవగాహన కల్పించాలన్నారు.
చెత్త తొలగించకపోతే చార్జీలతో పాటు జరిమానా
పట్టణ ప్రగతిలో నగరవాసుల జీవన ప్రమాణాలు పెంచడం, మెరుగైన శానిటేషన్, పచ్చదనం పెంపు, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు.ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రోజువారీ కార్యక్రమాలపై నివేదికలు అందజేయాలని హెల్త్ అండ్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు పంకజ, మమత, రవికిరణ్, శంకరయ్య, సామ్రాట్ అశోక్, ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు, డిప్యూటీ కమిషనర్లు, యూబీడీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
– జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్