జీడిమెట్ల, మే 17 : డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ఓ యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ కె.మన్మథరావు తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని పాతబస్తీ మంగళ్ హాట్కు చెందిన అజయ్సింగ్ (28) స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతడికి గంజాయి తీసుకునే అలవాటు ఉండటంతో కొత్తపేట పండ్ల మార్కెట్కు వచ్చే లారీ డ్రైవర్లను పరిచయం చేసుకుని గంజాయి ప్యాకెట్లను పలు ప్రాంతాల నుంచి తెప్పించి నగరంలో విక్రయిస్తున్నాడు. మంగళవారం సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందటంతో క్రైం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన అజయ్సింగ్ పారిపోయే ప్రయత్నంచేయగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 30 గంజాయి ప్యాకెట్లు, ఒక సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.