మెహిదీపట్నం, మే 17 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేరాల అదుపునకు పోలీసులు కృషి చేస్తున్నారు. నేరాలను చేయాలనుకునే వారు భయపడేలా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు పోలీస్ శాఖలో సంస్కరణలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు కృషి చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో సంక్షేమ సంఘాల సభ్యులతో కలిసి ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ..
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాల ఏర్పాటుకు షేక్పేట్ కార్పొరేటర్ రాషీద్ ఫర్హాజుద్దీన్ రూ.20 వేల చెక్కు అందజేశారు. కాలనీలు , బస్తీల్లో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కెమెరాలను పెట్టాలని సూచిస్తున్నామని ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గోల్కొండ, షేక్పేట్, సెవన్టూంబ్స్, టోలిచౌకి, షేక్పేట్ నాలా ప్రాంతాల్లో ఇప్పటికే 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇవే కాకుండా ప్రధాన కూడళ్లలో, ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ప్రజల సహకారంతోనే సాధ్యం..
ప్రజల సహకారంతోనే నేరాలను అదుపు చేయవచచ్చు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ఆసిఫ్నగర్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. డివిజన్లోని లంగర్హౌస్, గోల్కొండ, హుమాయూన్నగర్, టప్పాచబుత్ర, ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందించాలి.
– ఏసీపీ శివమారుతి, ఆసిఫ్నగర్ పోలీస్ డివిజన్