సికింద్రాబాద్, మే 17 : ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఉత్తీర్ణత నూరు శాతం సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుంది. దీని కోసం కొత్త ప్రణాళకను రూపకల్పన చేసింది. ఈ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్, మారేడ్పల్లి, తిరుమలగిరి పరిధిలోని సుమారు 42 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12 వేల మంది విద్యార్థులు పదో తరగతి విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమయాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాల సమయానికి అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజువారీగా ప్రత్యేక తరగతుల్లో బోధించే సబ్జెక్టులు పాఠం పేరుతో సహా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
ఎక్కువ మొత్తంలో పరీక్షలు నిర్వహించాం
పదో తరగతి విద్యార్థులకు వీలైనంత ఎక్కువ టాలెంట్ టెస్టులు నిర్వహించి, విద్యార్థులకు పరీక్ష కూడా విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వారి పాఠశాలలో వచ్చే సందేహాలు తీరిస్తే విద్యార్థులు మరింత మెరుగుపడుతారు.
వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి
పదో తరగతి సిలబస్ పూర్తి పరిశీలనకు ఇప్పటికే సికింద్రాబాద్, తిరుమలగిరి, మారేడ్పల్లి మండలాలకు ప్రధానోపాధ్యాయులను పరిశీలకులుగా నియమించారు. సిలబస్తో పాటు ఎప్పటికప్పుడు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేసి పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రతి విద్యార్థి ప్రతిభ కనబరిచేలా..
పదో తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి ప్రతిభను కనబర్చేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభు త్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి. కరోనా పరిస్థితుల వల్ల గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు విద్యకు దూరమైనప్పటికీ మారేడ్పల్లి జోన్ను ప్రథమ స్థానం లో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. అందు కనుగుణంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండటంతో ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా సూచనలు ఇవ్వాలి.
– కె. యాదయ్య, డిప్యూటీ డీఈఓ, మారేడ్పల్లి జోన్