జూబ్లీహిల్స్, మే17: అపరిష్కృత సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈనెల 20 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 20 నుంచి జూన్ 5 వరకు క్షేత్రస్థాయిలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో పక్షం రోజులపాటు పట్ట ణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూసుఫ్గూడతో పాటు రహ్మత్నగర్, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డలలో బల్దియా అన్ని విభాగాల అధికారులు బృందాలుగా పర్యటించనున్నారు. జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్లోని 91 కాలనీలలో ప్రతిరోజూ 4 నుంచి 5 కాలనీలను అధికారులు సందర్శిస్తారు. ఇందుకుగానూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఎ.రమేశ్ ఆధ్వర్యంలో ఒక్కో వార్డుకు 5 టీమ్లను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో టీమ్లో నోడల్ అధికారితో పాటు అన్ని విభాగాల సిబ్బంది పాల్గొంటారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపడుతూ వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. పకడ్బందీ పారిశుధ్య నిర్వహణ, రోడ్లపై గార్బేజ్ తొలగింపు, వర్షాలకు మ్యాన్హోల్లు, నాలాల ఉప్పొంగకుండా పూడికతీత పనులు, వరదలకు దెబ్బతింటున్న రోడ్లకు మరమ్మతులు, గాలిదుమారాలకు ఎదురయ్యే విద్యుత్ సమస్యలను అధికారులు అప్పటికప్పుడూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో ఆయా విభాగాల సిబ్బందితో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం డీఎంసీ రమేశ్, అధికారులతో కలిసి సర్కిల్లోని పలు ప్రాంతాలలో పర్యటించి పట్టణ ప్రగతి కార్యక్రమంపై సిబ్బందికి అవగాహన కల్పించారు.