బంజారాహిల్స్.మే 17: పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్ల కోసం ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని షేక్పేట మండల పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన 69 చెక్కులను ఎమ్మెల్యే దానం మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దేవరకొండ బస్తీలో స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి 17మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, నాయకులు జావెద్, అక్బర్, రఫీక్ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్లో..
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాల కింద మంజూరైన 52 చెక్కులను ఎమ్మెల్యే దానం లబ్ధిదారులకు అందజేశారు. ఫిలింనగర్లోని జ్ఞానీజైల్సింగ్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మె ల్యే దానం నాగేందర్ హాజరై చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మితో పాటు ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు పథకాలన్నీ పేదలకు భరోసా కలిగించేవే అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, చంద్రశేఖర్. నగేష్సాగర్, ఆర్.ఎల్లయ్య, అబ్దుల్ ఘనీ, వెంకటస్వామి, పద్మ, హనుమమ్మ పాల్గొన్నారు.