ఖైరతాబాద్, మే 17 : విశ్వనగరంలో బస్తీలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్లోని రాజ్నగర్లో మంగళవారం పలు స్టాగ్నేషన్ పాయింట్లను జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఈ చైతన్య, ఏఈ చరణ్, వాటర్ వర్క్స్ డీజీఎం హరిశంకర్తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ నేపథ్యంలో బస్తీలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి జరుగాలన్నది ఆయన సంకల్పమన్నారు. అందులో భాగంగానే వీడీసీసీ రోడ్లు, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. రాజ్నగర్లో ప్రధానంగా స్టాగ్నేషన్ పాయింట్స్ వల్ల ప్రతి వర్షా కాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ట్యాంక్బండ్ నిండినప్పుడు బ్యాక్ వాటర్ వచ్చి సమస్య వస్తుదని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అవలంబించాలని జడ్సీని కోరారు.
మారుతీనగర్లో రూ.3 కోట్ల వ్యయంతో ప్రత్యేక లైను వేసి ఈ సమస్యను పరిష్కరించామన్నారు. రాజ్నగర్కు కూడా నిధులు మంజూరయ్యాయని, ముందుగా స్టాగ్నేషన్ పాయింట్స్ను సరిచేసి, సీవరేజీ లైన్స్ వేసిన తర్వాత సీసీ, వీడీసీసీ రోడ్లు పూర్తి చేస్త్తామన్నారు.