బోడుప్పల్, మే17: పారిశుధ్యం, స్వచ్ఛతపై ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న పారదర్శక విధానాలను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు చేసి నగర ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన ఇండోర్ స్టడీ టూర్లో అధ్యయనం చేసిన పలు అంశాలను శానిటేషన్ విభాగం అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి మంగళవారం డంపింగ్ యార్డులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇండోర్, చండీగఢ్లో పారిశుధ్యంపై అధ్యయనం చేసిన పలు అంశాలు ఆచరణాత్మకంగా ఉన్నాయన్నారు.
స్వచ్ఛతకై అక్కడ అవలంభిస్తున్న విధానాలనే ఇక్కడ అమలు చేస్తే స్వచ్ఛ బోడుప్పల్గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని అన్నారు. తడిచెత్త, పొడిచెత్త, మెడికల్ వేస్టేజీని విడివిడిగా సేకరించాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు. ప్రతి కిలోమీటర్కు ఒకరు చొప్పున 28 డివిజన్లలోని అన్ని రోడ్లను క్లీన్ చేయడంతో పాటు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత తీసుకోవాలన్నారు. చెత్త ఆటోలు క్రమం తప్పకుండా నడపాలని, మైనర్లు లైసెన్స్ లేకుండా ఆటోలు నడిపినా, నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఆటోలు సంచరించినా కఠిన చర్యలుంటాయని సిబ్బందిని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్ చందర్గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు కొత్త రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.