మల్కాజిగిరి, మే 17: ఆధ్యాత్మిక చింతన అందరికీ ఉండాలని శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. సోమవారం రాత్రి మల్కాజిగిరి గీతానగర్లోని గీతాభవనం (శ్రీశారదాచంద్రమౌళీశ్వర ఆలయం)ను స్వామిజీ సందర్శించారు. గీతాభవన్లోని రెండో అంతస్తులో నిర్మాణంలో ఉన్న చంద్రశేఖర సరస్వతీ స్వామివారి హాల్ను పరిశీలించారు. అంతకు ముందు స్వామిజీకి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలోని శివపంచయతనం, అయ్యప్ప స్వామి, అన్నపూర్ణ అంజనేయ, నవగ్రహ దేవతా ప్రతిష్టిత ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆయన అనుగ్రహభాషణం చేస్తూ 1958లో నడియాడే దేవుడు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెపుతుందన్నారు. ఆ నడియాడే దేవుడు సంచరించిన ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చెందాలని అన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబ్రమణ్య శర్మ, సూర్యనారాయణ, హనుమత్రామయ్య, సేతురామన్, విజయకుమార్, రామ్మోహన్, ప్రసాదరావు, అర్చకులు శ్రీనివాస్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.