సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ ప్రజల నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ వద్ద నుంచి సుంకిశాల ద్వారా నీటిని తీసుకురావడం సాహసోపేతమైన నిర్ణయమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అన్నారు. తాగునీటి తరలింపునకు ఇంత పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఖర్చులకు వెనుకాడకుండా రూ.1450 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టారని, ఇది పూర్తయితే రానున్న 50 ఏండ్ల వరకు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నీటి సమస్యనే ఉండదని తెలిపారు. ముందుచూపుతో దేశంలో మరెక్కడా లేని పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.