సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ ) : ఆస్తిపన్ను చెల్లింపులో మొండి బకాయిదారులకు ప్రభుత్వం మరోసారి వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)ను ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. మొండి బకాయిదారులకు 90శాతం వడ్డీ నుంచి మినహాయింపునిస్తూ ఓటీఎస్ను అమలు చేసేందుకుగాను నిర్ణయించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ వారంలో ఈ ఓటీఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించనున్నదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 17.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఇందులో రెండు నుంచి మూడు లక్షల మంది పన్ను చెల్లించక బకాయిదారుల జాబితాలో చేరారు. వీరి నుంచి వడ్డీతో కలిపి రూ.1500కోట్ల మేర బకాయిల రూపంలో రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. వీరందరికీ ఓటీఎస్ అవకాశం కల్పిస్తే దాదాపు రూ.1000కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అయితే 2020 ఆగస్టు 1న ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టి రూ.550కోట్ల మేర పన్నులు రాబట్టుకున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1635 కోట్లు వసూలుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.