మేడ్చల్, మే 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ అవుతుండటంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నది. ఇప్పటికే ఉచిత శిక్షణ ఇప్పిస్తుండగా.. మరోవైపు అన్ని గ్రంథాలయాల్లో కావాల్సిన మెటీరియల్ను సమకూర్చుతున్నది. ముఖ్యంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థుల కోరిక మేరకు మరిన్ని పుస్తకాలు తెప్పిస్తామని వివరిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 17 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిల్లో గ్రూప్ -1 నుంచి గ్రూప్ -4 వరకు, టెట్, రైల్వే, ఆర్ఆర్బీ, పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు పూర్తి సమాచారం ఉన్న పుస్తకాలను సమకూర్చారు. నిరుద్యోగ యువత కోరిక మేరకు గ్రంథాలయ వేళల్లో సైతం మార్పులు చేశారు. కొన్ని గ్రంథాలయాలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. మరోవైపు గ్రంథాలయాలకు భవనాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫతేనగర్, కీసర, దేవరయాంజల్లోని గ్రంథాలయాల భవన నిర్మాణాలకు రూ.1.25 కోట్లు మంజూరు కాగా త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అన్ని పుసక్తాలు అందుబాటులో ఉంచాం..
జిల్లాలోని 17 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.2.50 లక్షల విలువైన పుస్తకాలను ఉద్యోగార్థులకు సమకూర్చాం. అవసరమైతే మరింత మెటీరియల్ను తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. పోటీ పరీక్షల నేపథ్యంలో గ్రంథాలయాల వేళల్లో మార్పులు సైతం చేశాం. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-సురేశ్బాబు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి