సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): నెల్లూరు-సూళ్లూరుపేట స్టేషన్ల మధ్య రెండు మెమో, విజయవాడ- చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య మరో రెండు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ రైళ్లు ఈ నెల 17న అందుబాటులోకి వస్తాయన్నారు.
ఆరు రైళ్ల రాకపోకలు నిలిపివేత..
ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో సిల్చర్-కోయంబత్తూర్, బెంగళూరు-అగర్తల, సికింద్రాబాద్-అగర్తల స్టేషన్ల పరిధిలో ఆరు రైళ్ల రాకపోకలను ఈ నెల 17 నుంచి 22 వరకు నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలాగే హడ్సపూర్-హైదరాబాద్ స్టేషన్ల మధ్య రెండు రైళ్లను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో మూడు రైళ్లను పాక్షికంగా నిలిపేస్తున్నట్లు తెలిపారు.
కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
వేసవి నేపథ్యంలో తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున కాచిగూడ-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 18, 19న ఈ రైళ్లు ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, వనపర్తి, గద్వాల్, కర్నూల్, కడప, రాజంపేట మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు.