సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): రద్దీ రోడ్డును దాటే సమయంలో పాదచారులకు ఇబ్బంది లేకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు సరికొత్తగా నాలుగు పాయింట్లలో పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించారు. ఈ నాలుగు పాయింట్లలో రోడ్డు దాటే పాదచారులు వందలాదిగా ఉండడంతో ఇక్కడ పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు అత్యవసరమని గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ రోడ్డు దాటాలంటే కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది.
ఆ సమయంలో కూడా పాదచారులు అతి వేగంగా దాటాల్సిన పరిస్థితి. ఈ సమయంలోనూ వాహనాల వేగానికి దీటుగా రోడ్లపై పరిగెత్తాల్సి ఉంటుంది. వయస్సు మీద పడిన వారికి ఇది ఇబ్బందిగా మారింది. ఏమాత్రం ఆలస్యమైనా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెలికాన్ సిగ్నల్లు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ అధికారులు అధ్యయన నివేదికను రూపొందించి జీహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చారు. వారితో ఇక్కడ పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే పాదచారులకు రోడ్డు దాటే సమయంలో భద్రత పెరుగుతుందని సూచించారు. దీంతో ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులు 1. చైతన్యపురి బస్సు స్టాప్ నుంచి ఎల్బీనగర్ 2. అష్టలక్ష్మి గుడి కమాన్ 3. ఎస్బీఐ ‘యూ’ టర్న్ నవీన కాలేజీ దగ్గర 4. డీ-మార్ట్, ఎల్బీనగర్ వద్ద పెల్లికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు పనులు ప్రారంభించారు.