హైదరాబాద్, మే 14 (నమస్తేతెలంగాణ) : జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవో రద్దు చేసినప్పటికీ 10 కిలోమీటర్ల పరిధిలోని పరిశ్రమల తరలింపు మాత్రం యధావిధిగా జరగనుంది. జీవో రద్దుకు, పరిశ్రమల తరలింపునకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఔటర్ రింగురోడ్డు పరిధిలోని పరిశ్రమలన్నింటినీ ఔటర్ అవతలికి తరలించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిసరాల్లోని పరిశ్రమలకు కూడా ఇదే వర్తిస్తుందని పేర్కొంటున్నారు.
జలాశయాలు కలుషితం కావొద్దనే..
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లు కలుషితం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వాటికి 10కిలోమీటర్ల పరిధిలో వివిధ రకాల పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని గతంలోనే నిర్ణయించింది. ఇందుకోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాకంచర్లలో పారిశ్రామికవాడను అభివృద్ధి చేశారు. మరోవైపు, ఉమ్మడి రాష్ట్రంలో జంట జలాశయాలను కాలుష్యం నుంచి రక్షించేందుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా నిర్మాణాలు జరగకుండా ఉండేందుకు అప్పటి ప్రభుత్వం జీవో 111ను జారీచేసింది. దీని అమలులో నిర్లక్ష్యం ఉండడంతో ఇండ్ల నిర్మాణంతోపాటు పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి. ఇందులో కొన్ని పరిశ్రమలు జీవో 111 రాకముందు నుంచే కొనసాగుతున్నాయి.
కాలక్రమంలో నగర మంచినీటి అవసరాలకు కృష్ణా,గోదావరి జలాలను తరలించడంతో ఈ జలాశయాలపై ఆధారపడడం తగ్గుతూ వస్తోంది. దీంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను రద్దుచేయడంతో కొన్ని ఆంక్షలు సాగించేలా సీఎస్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. జీవో రద్దయిన నేపథ్యంలో జంట జలాశయాలకు దగ్గర్లోని పరిశ్రమలను యధావిధిగా కొనసాగిస్తారని పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఇదివరకే ఔటర్లోపలి పరిశ్రమలన్నింటినీ ఔటర్ బయటకి తరలించాలని నిర్ణయించి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో 143.38ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామికవాడను అభివృద్ధి చేసింది.
కేంద్ర పర్యావరణ,అడవులశాఖ, స్టేట్ లెవల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ(ఎస్ఈఐఏఏ) ఈ పారిశ్రామికవాడకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. 10 కిలోమీటర్ల పరిధిలోని పరిశ్రమలను ఇదివరకే గుర్తించిన టీఎస్ఐఐసీ, జీహెచ్ఎంసీ వాటి తరలింపునకు పలుమార్లు నోటీసులు ఇచ్చాయి. ఇదివరకే పలు పరిశ్రమలకు రాకంచర్లలో ప్లాట్లు కూడా కేటాయించారు. కొన్ని పరిశ్రమలు అక్కడికి తరలినప్పటికీ గతంలో కొనసాగిన ప్రాంతంలో కూడా ఉత్పత్తులు ఇంకా కొనసాగిస్తున్నాయి. త్వరలోనే అన్ని పరిశ్రమలను రాకంచర్లకు తరలిస్తామని అధికారులు అంటున్నారు.
తరలించనున్న పరిశ్రమలు
స్టీల్ రీ-రోలింగ్ ఇండస్ట్రీ, కాపర్ ఉత్పత్తుల తయారీ, పాలిథిన్ బ్యాగుల తయారీ, టైల్స్ తయారీ, వైర్ డ్రాయింగ్(కోల్డ్ ప్రాసెస్)-బెయిలింగ్ స్ట్రాప్స్, ఎలక్ట్రిక్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల అసెంబ్లింగ్, జనరల్ ఇంజినీరింగ్, టైర్ రీట్రేడింగ్, ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్, బైస్కిల్స్ సహా నాన్ మోటరైజ్డ్ వాహనాల అసెంబ్లింగ్, ప్రింటింగ్ ప్రెస్, ఫుట్వేర్(రబ్బరు), కార్డ్బోర్డ్, పేపర్ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్, పీవీసీ గ్రూడ్స్, లెదర్ కటింగ్ అండ్ స్ట్రిచ్చింగ్, ఆటోమోబైల్ ఫ్యూల్ ఔట్లెట్.