ఖైరతాబాద్, మే 14: అధికార బలంతో తమకు అవసరమైన విధంగా రాజ్యాంగాన్ని మార్చుకొంటామని, అహంభావంతో మాట్లాడిన బీజెపీ ఎంపీ అరవింద్పై రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను సామాజిక, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతోపాటు దేశభక్తులంతా ఖండించాలని పిలుపు నిచ్చారు. రాజ్యాంగం జోలికి వస్తే తుకడా తుకడా చేస్తామని గతంలో చెప్పిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు తమ పార్టీ ఎంపీ అరవింద్ను కూడా తుకడా చేస్తారా అని ప్రశ్నించారు. అరవింద్ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం కాదని అది బీజేపీ విధానమని పేర్కొన్నారు. మను ధర్మశాస్త్రాన్నే రాజ్యాంగంగా ప్రవేశపెట్టాలన్నదని బీజేపీ సిద్ధాంతమని ధ్వజమెత్తారు.బీజేపీయే తమ శత్రువు అన్న విషయాన్ని దళితులు, గిరిజనులు బలహీనవర్గాల మహిళలు, మైనార్టీలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు.
27 మంది చనిపోయినట్లు సాక్ష్యం ఉన్నదా?
బండి సంజయ్ ఓ అబద్ధాల కోరు అని, రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారంటూ అసత్య ప్రచారానికి తెరలేపాడని గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. అంతమంది చనిపోయినట్టు సంజయ్ వద్ద సాక్ష్యాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. 27 మంది విద్యార్థులు చనిపోయినట్టు నిరూపించకపోతే సంజయ్కి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారని, దానికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. యూపీతోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేల మంది దళిత, గిరిజన మహిళలపై లైంగిక దాడులతోపాటు దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నాయని, వాటి సాక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిపారు.
బీజేపీ నాయకులంతా అబద్ధాలతోనే బతుకుతున్నారని, కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా తెప్పించలేకపోయిన అరవింద్ రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఆయనకు దమ్ముంటే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పార్లమెంట్లో ప్రకటన చేయించాలని, అప్పుడు దేశంలోని 40 కోట్ల మంది దళిత, గిరిజనులు, 60 కోట్లు మంది బీసీలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి, ప్రధాన కార్యదర్శి బండకింది సింగారయ్య గౌడ్, రాష్ట్ర మహిళ నాయకురాలు పోతురాజు సుమలత, భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ సుర్జీత్ రావణ్, బొంకూరి సురేందర్ సన్నీ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.