కొండాపూర్, మే 14: ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిందని మంత్రి పేర్కొన్నారు. మాదాపూర్ శిల్ప కళావేదికలో నిర్వహించిన స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల వార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రూ.80 వేల కోట్ల వ్యయంతో మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ను పూర్తి చేయగలిగామంటే రాష్ట్ర సివిల్ ఇంజనీర్ల ప్రతిభ ఎంతో ఉందని, వారిని ప్రత్యేకంగా అభినందించాలన్నారు.
ప్రపంచంలోని టాప్ కంపెనీలలో సీఈఓలుగా పని చేస్తున్న వారు అత్యధికులు భారతీయులని, వారిని ఆదర్శంగా తీసుకుని స్టాన్లీ ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్టాన్లీ కళాశాల కరెస్పాండెంట్ కె.కృష్ణారావు, డైరెక్టర్ రాకేష్రెడ్డి, ప్రదీప్రెడ్డిలు తనకు అత్యంత ఆప్త మిత్రులని వారు స్థాపించిన స్టాన్లీకి ఎంతో గుర్తింపు ఉందని, నగరం నడిబొడ్డున విద్యార్థినుల కోసం ప్రత్యేక కళాశాల ఉండటం సంతోషకరమన్నారు. తన కూతురుని స్టాన్లీలో చదివించాలని ఆశ పడ్డానని తెలిపారు.
స్టాన్లీ మహిళా ఇంజనీర్ కళాశాల విద్యార్థులు గత సంవత్సరం ఐదు వందలకు పైగా ఉద్యోగాలను సాధిస్తే ఈ సంవత్సరం తొమ్మిది వందలు దాటారంటే కళాశాల విద్యార్థుల ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ వీసీ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, కరెస్పాండెంట్ కె.కృష్ణారావు విద్యార్థులకు మంచి వసతులు కల్పించి, మంచి విద్యాబోధన అందించేలా పాటు పడుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ప్రధానంగా దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన పెళ్లి కూతుళ్లలా తయారై ఫ్యాషన్షోలో పాల్గొన్న కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంది. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఎస్ సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకట రమణ, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మినారాయణ, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ బి.శ్రీనగేష్, మెథడిస్ట్ చర్చి బిషప్ ఎంఏ డేనియల్, కళాశాల కరెస్పాండెంట్ కె కృష్ణారావు, అకాడమిక్స్ డీన్ డాక్టర్ ఏ.వినయబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యప్రసాద్ లంక, కళాశాల డైరెక్టర్లు రాకేష్రెడ్డి, ప్రదీప్రెడ్డి, డాక్టర్ అనూరాధ, డాక్టర్ ఏ.కనకదుర్గ పాల్గొన్నారు.