సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ క్రమంగా పెరుగుతోంది. కరోనా కారణంగా రెండేండ్లుగా సాధారణ స్థాయిలో ఉన్న ట్రాఫిక్… ఈ ఏడాది ప్రారంభం నుంచే ఔటర్పై వాహనాల పెరుగుదల కనిపించింది. జనవరిలో 1,21,133 వాహనాలు, ఫిబ్రవరిలో 1,40,552, మార్చిలో 1,40,884, ఏప్రిల్లో 1,45,761 వాహనాలు ఔటర్ రింగు రోడ్డుపై రోజుకు సరాసరిన ప్రయాణం చేశాయి. ఇందులో సింహభాగం ట్రాఫిక్ అంతా శంషాబాద్-గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉన్న 24 కి.మీ పరిధిలోనే ఎక్కువగా ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
మూడు చోట్ల కొత్తగా ఇంటర్చేంజ్లు…
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడువు ఉన్న ఓఆర్ఆర్పై పెరుగుతున్న ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ఈ అధ్యయనంలో ప్రస్తుత, భవిష్యత్లో ట్రాఫిక్ మరింత పెరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలుగా కోకాపేట, నార్సింగి, మల్లాపూర్-నిజాంపేటలను గుర్తించారు. అక్కడ కొత్తగా ఇంటర్చేంజ్ల నిర్మాణం పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.150 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఇందులో నార్సింగి ఇంటర్చేంజ్ పనులు 99 శాతం పూర్తి కాగా, ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో ట్రాఫిక్ను అనుమతించనున్నారు. అదేవిధంగా కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ను అనుసంధానిస్తూ చేపడుతున్న కోకాపేట ఓఆర్ఆర్ ట్రంపెట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు నిర్వహిస్తున్నారు.
22 కి.మీ మేర సర్వీసు రోడ్ల విస్తరణ..
దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు ఔటర్ ప్రధాన రహదారి ఎంత ముఖ్యమో అదే స్థాయిలో కొన్ని చోట్ల సర్వీసు రోడ్లు అంతే కీలకంగా మారాయి. గ్రేటర్ చుట్టూ శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తుండడంతో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న సర్వీసు రోడ్లపైనా ట్రాఫిక్ బాగా పెరిగింది. ఇప్పటికే ట్రాఫిక్ పెరిగిన ప్రాంతాలను గుర్తించి, సర్వీసు రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతంలో ఐటీ కారిడార్లో 2 మార్గాల్లో సుమారు 22 కి.మీ మేర సర్వీసు రోడ్డు నుంచి 2 వరుసల నుంచి 4 వరుసలకు విస్తరిస్తున్నారు.
దీని కోసం ప్రత్యేకంగా మరో రూ. 150 కోట్ల వరకు వెచ్చించనున్నారు. హెచ్ఎండీఏ అధికారులు తెలిపిన సమాచారం మేరకు గచ్చిబౌలి చౌరస్తా నుంచి నార్సింగి వరకు, అక్కడి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, తిరిగి నార్సింగి, కోకాపేట మీదుగా కొంపల్లి వరకు ఇరువైపులా సర్వీసు రోడ్లను ప్రస్తుతం ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసలతో నిర్మిస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.