మేడ్చల్, మే 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని శామీర్పేట్ మండలం అంతాయిపల్లిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల నిధులతో అన్ని హంగులతో భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో అధికారులకు అవసరమయ్యే ఫర్నిచర్ను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఈ నెల చివరి వారంలో కలెక్టరేట్ను ప్రారంభించి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కలెక్టరేట్ సమీపంలోనే కలెక్టర్, అదనపు కలెక్టర్ల భవనాల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తి కాగా, మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీశ్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కాగా, సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రాంగణ సమీపంలో 8వ విడత హరితహారంలో భాగంగా 20 వేల మొక్కలు నాటే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు.