బోడుప్పల్, మే14: స్వచ్ఛ నగరంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపడానికి పక్కా ప్రణాళికతో అధికార యంత్రాంగం, పాలకవర్గం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నది. ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది.
ప్లాస్టిక్పై నిషేధం…
కార్పొరేషన్లో ప్రజలకు ప్లాస్టిక్పై అవగాహన పెంచడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపార సముదాయాలపై అధికార యంత్రాం గం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారికి ప్రతి నెల దాదాపు 20మందికి జరిమానా విధిస్తున్నారు. స్వచ్ఛ వాహనాలకు మున్సిపల్ నిధులు రూ.2.17 కోట్ల ఖర్చు చేసి స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రతిరోజు 28 వాహనాల ద్వారా దాదాపు 40 టన్నుల చెత్తను డంపింగ్యార్డ్కు తరలిస్తున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్లో చెత్త నిల్వలు పేరుకుపోకుండాఅధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన..
స్వచ్ఛ సర్వేక్షణ్కు రూ.24లక్షల నిధులు వెచ్చించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డివిజన్ల వారీగా చెత్త కొనుగోలు కేంద్రాలను నెలకొల్పడానికి పాలకవర్గం ప్రయత్నాలు చేస్తున్నది. నగర పరిధిలో గ్రీనరీకి సమప్రాధాన్యత కల్పిస్తున్నారు. తడి, పొడి చెత్త వ్యర్థాలను వనరులుగా మార్చుకోవడంతో పాటు పరిశుభ్రతపై అధ్యయనం చేయడానికి స్టడీ టూర్ నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించి చెత్త సేకరణ, రీసైక్లింగ్పై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పచ్చదనానికి చర్యలు..
చెంగిచర్ల చింతల చెరువు కట్టకు 6వ విడుత హరితహారంలో భాగంగా నాటిన ఈతవనం అందరిని కనువిందు చేస్తున్నది. త్వరలో నిర్వహించే 8వ విడత హరితహారానికి కావాల్సిన సుమారు 5లక్షల మొక్కలను సిద్ధం చేశారు. స్వచ్ఛ, హరితనగరంగా తీర్చిదిద్దడానికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తున్నారు.
స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం..
స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం. సమీకృత మార్కెట్ యార్డు ఏర్పాటు కోసం సర్వే నంబర్ 63లో రెండెకరాల స్థలంలో మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కోరాం. అందుకు ప్రభుత్వం రూ. 2కోట్లు మంజూరు చేసింది. త్వరలో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించాం. చెత్త వ్యర్థాలను తొలగించడం, డ్రైనేజీలను శుభ్రపరచడం, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు ఫాగింగ్ చేయడంతో పాటు, త్వరలో చేపట్టే 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.
–సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ మేయర్