బంజారాహిల్స్, మే 14: పేదలను ఆదుకునేందుకు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు బస్తీలు, కాలనీలలో సమస్యలను పరిష్కరిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో రూ. 1.1కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ శనివారం శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని గాయత్రీహిల్స్, బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని జవహర్కాలనీలలో సీవరేజ్లైన్లతో పాటు మంచినీటి పైపులైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని అన్నారు.
ఇందిరానగర్లోని అంబికా మహిళా మండలి ప్రాంతంతో పాటు జవహర్కాలనీల్లో మురుగు సమస్యలపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు కొత్త లైన్లు వేయిస్తున్నామని తెలిపారు. వర్షాలు రాకముందే సీవరేజీపైపులైన్లు పూర్తిచేయడంతో పాటు వెంటనే రూ. 6కోట్ల వ్యయంతో అన్ని బస్తీల్లో సీసీ రోడ్లు వేయిస్తామని చెప్పారు. వర్షాకాలంలో జవహర్కాలనీకి ఎగువభాగం నుంచి భారీగా వరద వస్తుందని, ఈ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, జలమండలి జీఎం హరిశంకర్, తట్టిఖాన సెక్షన్ మేనేజర్ రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, చంద్రశేఖర్, డి. సింహం, రుద్రముని, చంద్రకళ, పెరుక కిరణ్కుమార్, మల్లేశ్యాదవ్, శ్రీధర్ పాల్గొన్నారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్లో..
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు రూ.40లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజీపైపులైన్ పనులను శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని వీధుల్లో స్ట్రీట్ లైట్స్ పనిచేయడం లేదని, నందినగర్కు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బి. భారతీనాయక్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, నాయకులు రాందాస్ చౌహాన్, భీమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
సుంకిశాల పనులు ప్రారంభించడంపై హర్షం..
హైదరాబాద్ నగరానికి మంచినీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందకు సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవిలో హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్యలు తీర్చాలంటే సుంకిశాల వద్ద డెడ్స్టోరేజ్ నుంచి నీటిని వినియోగించుకోవడమే ఏకైక మార్గమని ఎన్నో ఏండ్లుగా నిపుణులు చెబుతున్నారని.
ఈ విషయాన్ని గురించి తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లేవనెత్తినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించినా అప్పటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నగరవాసుల దాహార్తిని తీర్చడానికి శాశ్వత పరిష్కారం చూపుతూ సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి కేటీఆర్కు నగరవాసుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.