సైదాబాద్, మే 14 : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిపేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ అనంతరం జరుగుతున్న పది పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. రెండేండ్ల అనంతరం పదవ తరగతి విద్యార్థులకు నేరుగా జరుగుతున్న పరీక్షల్లో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తొలగించటానికి యోగా, మెడిటేషన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మండల పరిధిలోని 87 పాఠశాలలకు చెందిన 4,348 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. అందులో 2,093 మంది బాలురు, 2,255 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్కు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా వారిలో మానసిక చైతన్యం కల్పిస్తున్నారు.
సైదాబాద్ మండల పరిధిలో పరీక్ష కేంద్రాలు..
సైదాబాద్ మండల పరిధిలోని 25 పరీక్ష కేంద్రాలుండగా.. అందులో 23 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు, రెండు కేంద్రాల్లో ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు. మండల పరిధిలో మొత్తం 87 పాఠశాలలు ఉండగా, అందులో ప్రభుత్వ పాఠశాలలు-11, ప్రైవేటు పాఠశాలలు-67, ఎయిడెడ్ పాఠశాలలు-3, రెసిడెన్షియల్ పాఠశాలలు-2, తెలంగాణ గురుకుల మైనార్టీ పాఠశాలలు-2, బధిరుల పాఠశాల-1, అంధ బాలికల పాఠశాల-1 ఉన్నాయన్నారు. మండల పరిధిలో 4,348 మంది రెగ్యులర్ విద్యార్థులు పది పరీక్షలు రాయడానికి సన్నద్ధమవుతుండగా, అందులో బాలికలు 2,255, బాలురు 2,093 మంది ఉన్నారు. ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే విధంగా ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను కూడా ఈ నెలాఖరున నిర్వహించనున్నారు.
పరీక్షల్లో మాస్క్ తప్పనిసరి..
పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించి పరీక్ష కేంద్రానికి రావాలి. పరీక్ష కేంద్రాల్లో పారిశుధ్యం, వైద్యం వంటి సమస్యలు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమిస్తున్నాం. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించటానికి అవసరమైన చర్యలన్ని తీసుకుంటున్నాం.
– ఎం.విజయలక్ష్మి, ఉప విద్యాశాఖ అధికారి