చేవెళ్లటౌన్, మే 14 : పశువుల పేడ పంటలకు ఎంతో మేలు చేస్తున్నది. వానకాలం పొలాల సాగుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. రైతులు వానకాలం పంటలకు సిద్ధమవుతున్నందున ముందుగా పొలాల్లో పశువుల పేడను వేసుకుంటే మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఆవులు, గేదెల పేడ సేంద్రియ ఎరువుతో సమానం. దీన్ని దుక్కులు దున్నుకునే ముందే పంట పొలాల్లో వేసుకొని, ఆ తర్వాత దుక్కులు దున్నుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. దుక్కులు దున్నాక పశువుల పేడ పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఒక్కో ఎకరానికి నాలుగు నుంచి అయిదు ట్రాక్టర్ల లోడ్ల పశువుల పేడను ఎరువుగా ఉపయోగించాలి.
సేంద్రియ ఎరువైన పశువుల పేడ పంట పొలాల్లో వేయడంతో ఆ భూమిలో భూసారం పెరుగుతున్నది. పంటల సాగుకు జీవిత కాలం పెరుగుతుంది. భూమి గుల్లబారుటలో తోడ్పడుతుంది. సహజ సిద్ధమైన లవణాలు పంటకు అందుతాయి. భూమిలో ఉన్న ఆమ్లాలు, క్షారాల స్థాయిని నిలబెడుతుంది. నేలలో ఉన్న మంచి సూక్ష్మ జీవుల వృద్ధికి తోడ్పడితే, రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా దోహదపడుతున్నది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. పంటల సాగుకు ఖర్చు కూడా తక్కువవుతుంది. రైతులు వృథాగా పడి ఉన్న పశువుల పేడను సేకరించి పంట పొలాల్లో వేసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు అని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది రైతులు తమ పొలాల్లో కోడి, పశువుల ఎరువులను పోయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలు పాటిస్తే మరింత దిగుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.
అధికారుల సలహాలు పాటించాలి
పశువుల పేడ పంటలకు ఎంతో మేలుచేస్తుంది. పొలాలకు వేసుకోవడం వల్ల పంటలకు బలం చేరి అధిక దిగుబడి వస్తుంది. భూమిలో భూసారం పెరిగి పంటలు బాగా పండుతాయి. పశుల పేడ ఎకరాకు మూడు నుంచి 4 ట్రాక్టర్ల్లు వేసుకోవాలి. అప్పుడే అధిక దిగుబడి వస్తుంది. భూమిలో నీటిని నిలువ చేసుకునే శక్తిని పెంచుతుంది. భూమిలో తేమను ఆరకుండా చేసి మొక్కలకు నీటిని అందిస్తుంది.
– రమాదేవి, ఏడీఏ చేవెళ్ల
పశువుల పేడను పోగు చేస్తాం
పశువుల పేడను సంవత్సరం పాటు ఒకేచోట పోగు చేసి ఎండాకాలంలో ఎడ్లబండి, లేదా ట్రాక్టర్ల ద్వారా పొలంలో చల్లి భూమిని దున్ని పంటలు వేసేందుకు సిద్ధం చేసుకుంటాం. మరి కొందరు పశువులు లేక గొర్రెలు, పశువుల పేడను కొనుగోలు చేసి పొలంలో చల్లుకుంటారు. రసాయన ఎరువుల కన్నా, పశువుల ఎరువులతో పంటల దిగుబడి బాగా వస్తుంది.
– సయ్యద్ యూసుఫ్, మల్కాపూర్