మేడ్చల్ రూరల్, మే 13 : కరోనా కారణంగా రెండేండ్లు పది పరీక్షలు జరుగలేదు. ఈసారి కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఒక్కో కేంద్రానికి పరీక్ష రాయడానికి కేటాయించిన విద్యార్థుల సంఖ్యను తగ్గించారు. తగ్గించిన విద్యార్థులకు అనుగుణంగా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఆరు కొత్త కేంద్రాలు..
గతంలో ఒక్కో పరీక్షా కేంద్రానికి ఉన్న సౌకర్యాల దృష్ట్యా 220 నుంచి 250 మంది విద్యార్థులకు కేటాయించే వారు. ఈ సారి ఆ సంఖ్యను కుదించారు. అందుకనుగుణంగా కేంద్రాల సంఖ్యను పెంచారు. మేడ్చల్లో గతంలో 9 కేంద్రాలు ఉండగా ఈ సారి ఆరు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. గౌడవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డబిల్పూర్ నాజిరేన్ గ్రామర్ స్కూల్, మేడ్చల్ పట్టణంలోని ఎస్ఎస్జీ స్కూల్, శ్రీ వివేకానంద విద్యాలయ హైస్కూల్, సెయింట్ ఆన్స్, నాగార్జున టాలెంట్ స్కూల్ లో కొత్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గరిష్టంగా 180 మంది విద్యార్థులు..
గతంలో 220 నుంచి 250 మందిని కేటాయించిన పరీక్షా కేంద్రానికి ఈ సారి 180 మంది విద్యార్థులనుకేటాయించారు. గరిష్టంగా 180 మందిని కనిష్టంగా 110 మంది విద్యార్థులను కేటాయించారు. మొత్తం 2330 మంది విద్యార్థులు 15 కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నాం..
పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్ నిబంధనల దృష్ట్యా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాం. పాత, కొత్త కేంద్రాలను సందర్శిస్తూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసే సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.ప్రతి కేంద్రంలో కొవిడ్ నిబంధలకనుగుణంగా బెంచీకి ఒకరి చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు శానిటైజర్, మాస్క్ను విధిగా వినియోగించాలి. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. -వసంతకుమారి,
మండల విద్యాధికారి