సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : 22 ఏండ్ల నుంచి చోరీలే అతని వృత్తి. రెండు సార్లు పీడీ యాక్ట్ మీద జైలులో ఉన్నా ప్రవర్తన మారలేదు. 2019 తర్వాత జైలు నుంచి విడుదలయి 31 దొంగతనాలకు పాల్పడి బుధవారం రాచకొండ పోలీసులకు చిక్కాడు. విచారణలో పోలీసులు 50 లక్షలు విలువ చేసే కేజీ బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో డీసీపీ సంప్రీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది డిసెంబరు 17న కర్మన్ఘాట్ పద్మరావునగర్లో ఇంటికి తాళం వేసి వెళ్లిన మహిళ ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి 25 తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు దర్యాప్తులో భాగంగా రాచకొండ సీసీఎస్ పోలీసులు దాదాపు ఐదు నెలలుగా నిరంతరం లభించిన క్లూస్ ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానంతో బుధవారం సరూర్నగర్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సయ్యద్ హమీద్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హమీద్ 2019 సంవత్సరంలో జైలు నుంచి విడుదలైన తర్వాత రాచకొండ పోలీసు కమిషనరేట్ -21, సైబరాబాద్-2, నిజామాబాద్-7, కర్నాటకలోని -1 పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ దొంగను పట్టుకున్న సీసీఎస్ పోలీసులను డీసీపీ అభినందించారు.
10 నిమిషాల్లో లూటీ …
వరంగల్ టౌన్ దేశాయిపేటకు చెందిన సయ్యద్ హమీద్ 2000 సంవత్సరం నుంచి చోరీలు ప్రారంభించాడు. ఈ చోరీలన్నీ ఒకడే తిరుగుతూ చేస్తుంటాడు. ఒక ప్రాంతంలో చోరీ చేసిన తర్వాత రెండోసారి ఆ ప్రాంతం వైపు వెళ్లడు. తాళం కనపడితే చాలు 10 నిమిషాల్లో ఇంటిని దోచేస్తాడు. చోరీలు చేసిన తర్వాత ఇతర ప్రాంతాలు, రాష్ర్టాలకు తన మకాం మార్చేస్తాడు. ప్రస్తుతం మహారాష్ట్ర నాందేడ్లో నివాసం ఉంటున్నాడు. పండ్లు, బియ్యం వ్యాపారిగా చెప్పుకుంటాడు. రైలులో ప్రయాణించి, స్టేషన్ దిగిన తర్వాత చోరీకి వెళ్లాల్సిన ఏరియాలకు ఆటోలో వెళ్తాడు. సెల్ఫోన్ను వాడడు. చోరీ చేసిన సొత్తును పలు ప్రాంతాల్లో విక్రయిస్తాడు. వచ్చిన డబ్బుతో గోవాలో పేకాటాడుతాడని పోలీసుల విచారణలో హమీద్ తెలిపాడు.