సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. నగరం నలువైపులా అకాశహర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, విల్లాలతో మినీ నగరాలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా వెస్ట్ కారిడార్లో పెట్టుబడులకు కంపెనీలు క్యూ కడుతుండటం, ఐటీ కంపెనీల రాకతో భారీగా ఉపాధి అవకాశాలు రావడం, తద్వారా జనాభా అవాసాల రద్దీ వెరసి మౌలిక వసతుల కల్పనకు అవసరం ఏర్పడింది. దానికి అనుగుణంగా ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కోర్ సిటీ తరహాలోనే శివారు ప్రాంతాల్లో పుష్కలంగా తాగునీరు అందించేందుకుగాను జలమండలి ఓఆర్ఆర్ ఫేజ్-2 పథకానికి అంకురార్పణ చేసింది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకుగాను రూ.1200కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులు చేపట్టింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్చెరువు నియోజకవర్గాల్లో రెండు ప్యాకేజీలుగా విభజించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నారు.
విడతల వారీగా కాలనీలకు నీటి సరఫరా
ఓవైపు రిజర్వాయర్ల పనులు, మరోవైపు పైపులైన్ ఏర్పాటు పనులు ఏకకాలంలో వడివడిగా జరుగుతున్నాయి. 13.7 కోట్ల లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణ పనులు, 2,864 కిలోమీటర్ల మేరలో ఇన్లెట్, అవుట్ లెట్ పైపులైన్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు మొదటి ప్రాధాన్యతగా తీసుకున్న కాలనీల్లో పనులు పూర్తి చేసి ఇప్పటికే 60 కాలనీల ప్రజలకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నారు. మరో 58 కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. పైపులైన్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో కొత్త నల్లా కనెక్షన్ల జారీ ప్రక్రియలో ప్రత్యేకంగా క్యాంపులను నిర్వహించి నల్లా కనెక్షన్లను మంజూరు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలాఖరు నాటికల్లా ఈ పథకం పూర్తి చేయడం ద్వారా రెండు లక్షల కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు రానున్నాయి.
నిర్విరామంగా కొనసాగుతున్న పనులు
ఒక్కటే లక్ష్యం.. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి వాటి ఫలాలను ప్రజలకు అందజేయడం. ఈ ఏడాది జనవరిలో ఓఆర్ఆర్ ఫేజ్-2 పథకం పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యాన్ని ఖరారు చేశారు. రంగంలోకి దిగిన జలమండలి అధికారులు ప్రతిపాదిత రిజర్వాయర్ల స్థలాలను నిర్ణీత సమయంలో సేకరించడమే కాదు.. పనులను వేగిరం చేశారు. కేవలం రెండు నెలల్లోనే రిజర్వాయర్ల నిర్మాణ పనులు 50శాతానికి పైగా దాటించారు. జోరు వానలు కురిసినా.. పనుల్లో అంతరాయం లేకుండా నిర్విరామంగా జరిగాయి. రాజేంద్రనగర్ మండల పరిధిలోని కిస్మత్పుర, బృందావన్ కాలనీ, నార్సింగి ప్రాంతాల్లో చేపట్టిన రిజర్వాయర్ల పనులే ఇందుకు నిదర్శనం.
స్వరాష్ట్రంలో రికార్డు సమయంలో పథకాలు పూర్తి
తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఒకప్పుడు సంవత్సరాల తరబడి సమయం పట్టేది. కానీ స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో జలమండలి ఎండీ దానకిశోర్ నిరంతర పర్యవేక్షణలో కీలక ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాయి. గోదావరి మొదటి దశ, కృష్ణా మూడో దశ, శివారు మున్సిపాలిటీల్లో రూ. 1900కోట్ల హడ్కో తాగునీటి పథకం, ఓఆర్ఆర్ ఫేజ్-1 పథకం పనులు రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేశారు. మండు వేసవిలోనూ సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తున్నారు. కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా జలమండలి ప్రధాన కార్యాలయం ఎదుట ఖాళీ కుండలు, బిందెల ప్రదర్శనలకు స్వస్తి పలికారు. ఈ ప్రాజెక్టు కోవలోనే ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టు చేరనున్నదని అధికారులు చెబుతున్నారు.
భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా
ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్లో కూడా సమృద్ధిగా నీటి సరఫరా జరిగేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. 2036 నాటికి ఈ ప్రాంతాల్లో జనాభా సంఖ్య 33.92 లక్షలకు పెరుగనున్నదని అంచనా వేసి, పెరిగే జనాభాకు సరిపడా నీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టు చేపట్టాం. రెండు లక్షల కుటుంబాలకు నల్లాలు ఇవ్వడం జరుగుతున్నది. సుమారు 20 లక్షల మంది ప్రజలకు పుష్కలంగా నీటి సరఫరా జరుగనున్నది. ఇంత వరకు నీటి సరఫరా లేని ప్రాంతాలకు నీటిని అందించవచ్చు. ప్రస్తుతం మూడు రోజులకు, అంతకంటే ఎక్కువ రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతున్న ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటిని అందించవచ్చు. సరఫరా వ్యవస్థలోనూ లోప్రెషర్ సమస్య ఉండదు.
– దానకిశోర్, జలమండలి ఎండీ
ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టు వివరాలు
ప్రాజెక్టు వ్యయం: రూ.1200కోట్లు
నిర్మించ తలపెట్టిన నూతన రిజర్వాయర్లు: 75
పూర్తి సామర్థ్యం: 137 ఎంఎల్
కొత్తగా వేస్తున్న పైపులైన్లు: 2864 కిలోమీటర్లు హెచ్డీపీఈ పైపులైన్ 1827 కిలోమీటర్లు, 1037 కిలోమీటర్ల డీఐ పైపులైన్
లబ్ధిపొందనున్న కాలనీలు: 978 (6,32,960 మంది ప్రజలకు లబ్ధి)
ప్యాకేజీ-1 పనుల వివరాలు
ప్రాజెక్టు వ్యయం: రూ.613 కోట్లు
ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మండలాలు: 7
నూతన రిజర్వాయర్లు: 34
1571 కిలోమీటర్ల మేర నూతన పైపులైన్ హెచ్డీపీఈ పైపులైన్ 1071 కిలోమీటర్లు, డీఐ పైపులైన్ 500కిలోమీటర్లు
ప్రస్తుత తలసరి సరఫరా 90-100 ఎల్పీసీడీలు
ప్రాజెక్టు పూర్తి ద్వారా రోజూ ప్రతి మనిషికి 150 ఎల్పీసీడీలు
కొత్తగా నల్లా కనెక్షన్ల జారీ అంచనా 87,293 మందికి, 4,36,465 మంది ప్రజలకు లబ్ధి
ప్యాకేజీ-2 పనుల వివరాలు
ప్రాజెక్టు వ్యయం: రూ. 587కోట్లు
ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మండలాలు: 5
నూతన రిజర్వాయర్లు: 41
పూర్తి సామర్థ్యం: 71.5 ఎంఎల్
1293 కిలోమీటర్ల మేరలో నూతన పైపులైన్
హెచ్డీపీఈ పైపులైన్ 756 కిలోమీటర్లు, డీఐ పైపులైన్ 537 కిలోమీటర్లు
ప్రస్తుత తలసరి సరఫరా
90-100 ఎల్పీసీడీలు
ప్రాజెక్టు పూర్తి ద్వారా
రోజూ ప్రతి మనిషికి 150 ఎల్పీసీడీలు
కొత్తగా నల్లా కనెక్షన్ల జారీ అంచనా 87,270 మందికి, 1,96,495 మంది ప్రజలకు లబ్ధి