సిటీబ్యూరో, మే 10 (నమస్తేతెలంగాణ) : ఒకప్పుడు మురికికూపంగా ఉన్న మూసీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇపుడు ప్రణాళికాబద్ధంగా మూసీని సుందరీకరిస్తున్నారు. ఆహ్లాదంగా ఉండేలా పచ్చని మొక్కలు పెంచడంతోపాటు సమీపంలో భగాయత్ లేఅవుట్తో పెద్దఎత్తున భవనాలు వెలుస్తున్నాయి. సుమారు 500 ఎకరాలకు పైగాఉన్న గడ్డి భూముల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) దశలవారీగా చేపడుతున్న లేఅవుట్లతో మూసీ తీర ప్రాంత స్వరూపమే మారిపోతున్నది. రామంతాపూర్ వద్ద మొదలయ్యే ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మూసీనది పొడవునా 5 కి.మీ మేర 120 అడుగుల రోడ్డు నిర్మాణంతోపాటు వేలాది మొక్కలు నాటి పచ్చనిచెట్లతో సుందరీకరించారు.
మినీ శిల్పారామంతో సందడే సందడి
ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని మూసీ వెంట ప్రభుత్వం 733 ఎకరాల గడ్డి భూములను సేకరించింది. ఇందులో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు 104 ఎకరాలు కేటాయించగా, మరో 55 ఎకరాలను కుల సంఘాలకు, 7.5 ఎకరాలను మినీ శిల్పారామానికి కేటాయించారు. ఈ భూములు మినహా మిగతా భూముల్లో హెచ్ఎండీఏ అన్ని వసతులు,విశాలమైన రహదారులతో అభివృద్ధి చేసింది. మెట్రోరైలు డిపోతోపాటు, మెట్రోరైలు సేవల కోసం నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనంలో కార్యకలాపాలు జరుగుతుండగా, ఉప్పల్ మినీ శిల్పారామం సందర్శకులను అలరిస్తున్నది. భగాయత్ లేఅవుట్లో భాగంగా ఉన్న మినీ శిల్పారామం ప్రత్యేకాకర్షణగా మారింది.
20 అంతస్థులతో భారీ అపార్టుమెంట్
ఉప్పల్ భగాయత్ లేఅవుట్ రెండోదశలో భాగంగా చేపట్టిన 72 ఎకరాల మల్టీపుల్ యూజ్ జోన్లో 2.17 ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవీ గ్రూపు 20 అంతస్థులతో అపార్టుమెంట్ ప్రారంభించింది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, మరో 100కుపైగా భారీ అపార్టుమెంట్లు, వ్యక్తిగత ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రధానంగా ఇన్నర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఉప్పల్ భగాయత్ లేవుట్ విస్తరించి ఉంది. ఒకవైపు సుమారు 300 ఎకరాలు, మరో 400లకు పైగా ఎకరాలు ఉంది. దీంతో ఇరువైపులా రోడ్ల అనుసంధానంతో స్థానికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి.
మల్టీపర్పస్ యూజ్ జోన్
క్లియర్ టైటిల్తో మధ్యతరగతి వారికి, సంపన్నులకు అందుబాటులో ఉండేలా 150 గజాల మొదలుకొని 5వేల గజాల వరకు ప్లాట్లు ఈ లేఅవుట్లో ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ లేఅవుట్లో 100 అడుగుల రోడ్డును ఆనుకొని ఆస్పత్రులు, షాపింగ్ కమ్ ఎంటర్టైన్మెంట్, మల్టీపర్పస్ యూజ్ కోసం భారీ సైజు ప్లాట్లను 5వేల గజాల విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు.
లేఅవుట్ మీదుగా రేడియల్ రోడ్డు
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో సుమారు 5.కి.మీ మేర వేసిన 100 అడుగుల రోడ్డును రేడియల్ రోడ్డుగా గుర్తించారు. నాగోల్ -ఉప్పల్ మధ్య ఇన్నర్రింగురోడ్డు నుంచి ఔటర్ వరకు రేడియల్ రోడ్డు నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది సాకారమైతే భగాయత్ లేఅవుట్ నుంచి నేరుగా ఓఆర్ఆర్కు చేరుకోవచ్చు.
రెండు లింకురోడ్లు
ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రధాన రహదారుల విస్తరణతోపాటు లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. భగాయత్ లేఅవుట్ నుంచి నాగోల్ మూసీ వంతెన నుంచి ఉప్పల్ ఏషియన్ థియేటర్, నల్లచెరువు, పీర్జాదిగూడ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని కలుపుతూ లింకురోడ్లు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో నాగోలు-బండ్లగూడ నుంచి మరో లింకు రోడ్డు పీర్జాదిగూడ వద్ద కలిసేలా మూసీపై వంతెనను నిర్మించనున్నారు.