సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు బెస్ట్ పోలీస్గా గుర్తింపు వచ్చిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన స్త్రీ సమ్మిట్- 2023ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీ (ఎస్టీఆర్ఈఈ) సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ మహానగరం ప్రశాంతంగా ఉండేలా హైదరాబాద్ పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, ప్రధానంగా మహిళలకు సురక్షితమైన ప్రదేశంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రతి మహిళ విద్యావంతురాలైతే రాష్ట్రం పురోగతి చెందుతుందని సీఎం కేసీఆర్ విశ్వసిస్తూ మహిళాభివృద్ధి, రక్షణతోపాటు విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని హోంమంత్రి అన్నారు. నగరంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే వెంటనే గుర్తించే విధంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రపంచంలోనే సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా తీర్చిదిద్దామన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. మహిళల రక్షణకు తోడ్పడుతున్న ప్రతి పోలీసుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మహిళలు ఏ సమయంలోనైనా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఉన్నదని, మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిపారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నదని, ప్రజలకు, ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. స్త్రీల యొక్క గౌరవం, సమానత్వం, సాధికారితను పెంపొందించడం ఈ స్త్రీ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమన్నారు. మహిళల రక్షణ కోసం పొక్సో, షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ వంటివి తెలంగాణలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. 174 ఏళ్లలో మొదటి మహిళా ఎస్హెచ్ఓగా లాలాగూడ ఠాణాకు మధులతను నియమించామని సీపీ గుర్తు చేశారు. స్త్రీ సమ్మిట్లో కీలక అంశాలు ఉన్నాయని, సైబర్ సెక్యూరిటీ ఫోరమ్, ఉమెన్ ఫోరమ్, ట్రాఫిక్ ఫోరమ్, యాంటీ నార్కొటిక్ ఫోరమ్, సెక్యూరిటీ తదితర ఫోరమ్స్ ద్వారా వివిధ అంశాలపై హెచ్సీఎస్సీతో కలిసి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఏఐజీ దవాఖాన చైర్మన్ డి.నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఏఐజీలో పనిచేస్తున్న సిబ్బందిలో 60 శాతం మహిళలు ఉన్నారని, వారి విధేయత, చిత్తశుద్ధి విజయాన్ని సాధించడానికి ప్రేరేపిస్తున్నదన్నారు. స్త్రీల మెదడు బహుళ- పని, హేతుబద్ధమైన రీతిలో పనిచేస్తుందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కుటుంబాలలో అనేక వ్యతిరేక పరిస్థితులను తట్టుకొని మహిళలు విజయం సాధిస్తున్నారన్నారు. నేడు అనేక రంగాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు రాణిస్తున్నారని, స్త్రీలు ముందుకొచ్చి వారి మానసిక ఆరోగ్యం గూర్చి మాట్లాడాలని, అందుకు సహకరించేందుకు స్త్రీ పని చేస్తుందన్నారు. 1.4 బిలియన్ జనాభాకు కేవలం ఐదుగురు గ్యాస్ట్రిక్ డాక్టర్లు మాత్రమే సమర్థవంతమైన క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నారన్నారు. తనకు తెలిసిన బెస్ట్ ఎండోస్కోపి సర్జరీలను ప్రపంచవ్యాప్తంగా మహిళా డాక్టర్లే ఎక్కువగా చేస్తున్నారంటూ వారి సేవలను కొనియాడారు.
ఈ సెమినార్లో వివిధ రంగాల్లో ప్రావీణ్యత కలిగిన మహిళలతో ఆయా అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఆయా రంగాలలో వారు ఎలా రాణించగలిగారు.. ఎదిగేందుకు దోహదపడిన అంశాలు.. కుటుంబ నేపథ్యం.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎదుర్కొన్న ఇబ్బందులు.. తదితర విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించి, యువత ఒక లక్ష్యంతో పనిచేయాలని స్ఫూర్తినిస్తూ మార్గనిర్దేశం చేశారు. కుటుంబ వాతావరణం, సోషల్ మీడియా వినియోగం, కౌమార బాలికల సంక్షేమం, సైకో సెమాంటిక్ స్రెస్పెక్టివ్ నుంచి విశ్లేషణకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఎస్సీ కన్వీనర్, నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్, హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ చైతన్య గొర్రెపాటితో పాటు ఫిక్కీ ఎఫ్ఎల్ఓ, క్యూసిటీ, ఆల్ షిఫా ఫౌండేషన్, కామ్4యూ, విషెస్ ఫౌండేషన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. మహిళల భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్గా ఉన్నాయంటూ.. హ్యాట్సాఫ్ టూ తెలంగాణ గవర్నమెంట్ అని కొనియాడారు. షీ టీమ్స్, భరోసా, ఉమెన్ సేఫ్టీ వింగ్తో పాటు ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే క్షణాల్లో వాలిపోయే పోలీస్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఇది మహిళలకు ఎంతో సురక్షితమైన ప్రాంతమన్నారు. సెమినార్లో రేడియో జాకీ భార్గవి లావణ్య ఫరియా అబ్దుల్లాతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు తన కుటుంబం పూర్తి అండగా ఉన్నదని, కుటుంబ వాతావరణంతోనే మహిళలు ప్రాథమిక స్థాయి నుంచి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. మనిషిని మనిషిలా చూడాలని, మనం ఏదైతే ఇస్తామో.. అదే తిరిగి వస్తుందన్నారు. అన్ని విషయాల్లో సంయమనంతో బ్యాలన్స్గా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో మహిళలకు ఉన్న సురక్షితమైన వాతావరణం ఇతర ప్రాంతాల్లో కనిపించదన్నారు. ఇక్కడి ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయన్నారు.