సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): సాంకేతికతను అడ్డంపెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. ప్రత్యేక ఆపరేషన్లలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 13 ప్రధాన కేసుల్లో 20 మంది నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. సిటీ అడిషనల్ పోలీసు కమిషనర్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం మార్చి నెలలో బాధితులకు సుమారు రూ.1,59,69,564 మొత్తాన్ని రీఫండ్ చేయించామని చెప్పారు.
హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఈ అంతర్ రాష్ట్ర ఆపరేషన్లో తెలంగాణ నుంచి 15 మంది, కేరళ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, గోవా, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6.5లక్షల నగదు, 14మొబైల్ ఫోన్స్, 4ల్యాప్టాప్లు, చెక్బుక్కులు, షెల్ కంపెనీలకు చెందిన స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ప్రధానంగా పెట్టుబడులు, గేమింగ్, మ్యాట్రిమొనీ, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మార్చి నెలలో నమోదైన కేసుల్లో ఒక గేమింగ్ మోసం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఇన్స్టాగ్రామ్లో ప్రకటనతో ఆకర్షితురాలైన బాధితురాలు అధిక లాభాల ఆశతో ఏకంగా రూ.26.07కోట్లు నష్టపోయింది. ఈ కేసులో హైదరాబాద్, మేడ్చల్, కేరళ, గోవాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మార్చిలో బాధితులు రూ.4.40కోట్లు కోల్పోగా బ్యాంకింగ్ రంగంతో సమన్వయం చేసుకుని రూ.1.59కోట్లకు పైగా మొత్తాన్ని వెనక్కు రప్పించారు. డెబిట్ కార్డ్ ఫ్రాడ్, కస్టమర్కేర్ ఫ్రాడ్ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న మొత్తాన్ని 100శాతం తిరిగి ఇప్పించామని అడిషనల్ సీపీ తెలిపారు.