సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సులతో ప్రతిరోజూ దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. లాక్డౌన్ విధించిన సమయంలో సిటీ బస్సుల ఆదాయం కేవలం రూ.15 లక్షలు మాత్రమే వచ్చింది. లాక్డౌన్ను పూర్తిగా ఎత్తి వేసిన నాటి నుంచి క్రమంగా సిటీ బస్సుల ఆదాయం పెరుగుతూ వచ్చింది. నెలలో ప్రతి రోజూ సగటున రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజూ 2,500 వరకు సిటీ బస్సులు మహానగర రోడ్లపై తిరుగుతున్నాయనీ, 50 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి గత నెల రోజులుగా స్థిరంగా ఉంటుందని తెలిపారు. విద్యా సంస్థలు పూర్తిగా తెరిస్తే అక్యుపెన్సీ 70 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యా సంస్థలు పనిచేయడంతో జనరల్ పాసులు, స్టూడెంట్ పాసుల సంఖ్య కూడా పెరుగుతుందని, దాని వల్ల ఆర్టీసీకి మరింత ఆదాయం వస్తుందన్నారు.
వచ్చేది పండుగల సీజన్. ప్రస్తుతం బక్రీద్ ఉంది. వెంటనే రాఖీ పండుగ వస్తుంది. ఆ తర్వాత వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్నాయి. దీంతో గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరుగనున్నది. ఈ క్రమంలో సిటీ బస్సుల్లో కూడా అక్యుపెన్సీ పెరగడానికి, ఆదాయం రావడానికి అవకాశం ఉన్నదని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సిటీ బస్సులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.